మూడో పెళ్లికి…రెండో భార్య సాక్షి

విజయవాడ, నవంబర్‌ 28
వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ జయ మంగళ వెంకటరమణ మూడో సారి ఒకింటి వారయ్యారు. కైకలూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సుజాతను వివాహం చేసుకున్నారు. సుజాత ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. ఎమ్మెల్సీ జయ మంగళ వెంకటరమణకు ఇది మూడో వివాహం. ఈ మూడో పెళ్లికి రెండో భార్య సాక్షి సంతకం చేయడం కథలో అసలు ట్విస్ట్‌. భార్య, కుమారుడు సమక్షంలోనే మూడో పెళ్లి జరిగింది. ఎమ్మెల్సీ మొదటి భార్య అనారోగ్యంతో చనిపోయారు. అప్పటికి ఆమెకు ఓ కుమార్తె ఉంది. తర్వాత వెంకట రమణ రెండో పెళ్లి చేసుకున్నారు. రెండో పెళ్లి ద్వారా ఓ కుమార్తె, ఓ కుమారుడు ఉన్నారు. ఇప్పుడు మూడో పెళ్లి చేసుకున్నారు. మూడో పెళ్లి చేసుకున్న సుజాత ఏలూరు రేంజ్‌ అటవీ శాఖలో సెక్షన్‌ అధికారిగా పని చేస్తున్నారు. ఆమెకు కూడా గతంలో పెళ్లి జరిగి ఓ కుమారుడు ఉన్నారు. ఆమెకు రెండో పెళ్లి కాగా వెంకటరమణకు మూడో పెళ్లి . కుటుంబంలో ఎలాంటి గొడవలు రాకుండా రెండో భార్యను ఒప్పించి ఎమ్మెల్సీ మూడో పెళ్లి చేసుకున్నారు. స్వయంగా రెండో భార్య సాక్షి సంతకం చేయడమే దీనికి కారణం. జయ మంగళ వెంకట రమణ ఇటీవలి కాలం వరకూ టీడీపీలోనే ఉన్నారు. ఆయన కైకలూరు నియోజకవర్గ ఇంచార్జ్‌ గా ఉన్నారు. జయమంగళ వెంకటరమణ 1999లో తెలుగుదేశం ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2005లో కైకలూరు జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున కైకలూరు నియోజకవర్గం గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీతో పొత్తుల్లో భాగంగా టికెట్‌ ఇవ్వలేదు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు.ఆ తర్వాత టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. వైసీపీలో చేరిన వెంటనే ఆయనకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి ఆఫర్‌ చేశారు. ఎన్నికల్లో ఆయన నిలబడి.. ఉత్కంఠ పోరులో రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలిచారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *