జగన్‌, జేపీ చర్చలపై రాజకీయ ప్రాధాన్యం

విజయవాడ, ఆగస్టు 7
మాజీ ఐఏఎస్‌ అధికారి, లోక్‌ సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణ, ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైస్‌ జగన్‌ ఒకే వేదిక విూద కనిపించారు. ఆప్కాబ్‌ వజ్రోత్సవ వేడుకల్లో వీరిద్దరూ పక్క పక్కనే కూర్చొని.. మాట్లాడుకున్నారు. జయప్రకాశ్‌ నారాయణ వేదికపైకి వచ్చిన సమయంలో లేచి నిలబడిన జగన్‌.. చేతిని ముందుకు చాపి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చారు. మంత్రులు కాకాణి, జోగి రమేశ్‌ మధ్యన జేపీ కూర్చున్నారు. మంత్రి ప్రసంగం సమయంలో జగన్‌ దగ్గరకు వెళ్లిన జేపీ ఆయనతో మాట్లాడటం ఆసక్తి కలిగించింది. జేపీ మాట్లాడుతుండగా.. జగన్‌ నవ్వుతూ ఆసక్తిగా విన్నారు. వెళ్లే సమయంలో సీఎం జగన్‌.. జేపీ దగ్గరకు వెళ్లి ఏదో మాట్లాడారు.సీఎం జగన్‌తో జేపీ వేదిక పంచుకోవడం, జయప్రకాశ్‌ నారాయణ మాటలను ముఖ్యమంత్రి ఆసక్తిగా వినడం.. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జయప్రకాశ్‌ నారాయణ లోక్‌ సత్తా పార్టీని ఏర్పాటు చేసిన కూకట్‌పల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ కార్యకర్తల్లోనూ చాలా మందికి జేపీ అంటే అభిమానం. జగన్‌ ఎప్పుడూ ఎల్లో విూడియా అని విమర్శించే విూడియా సంస్థలు.. చంద్రబాబు తర్వాత జేపీకి ప్రాధాన్యం ఇచ్చేవి. రాజకీయాలను మార్చేయాలని వచ్చిన జేపీ.. ఆ దిశగా విజయవంతం కాలేకపోయారు. కానీ ఆయన మాత్రం ఇప్పటికీ తన భావాలకే కట్టుబడి ఉన్నారు.జగన్‌ సర్కారుపై జేపీ గతంలో అభినందించిన సందర్భాలున్నాయి. జగన్‌ సర్కారు ఫ్యామిలీ డాక్టర్‌ పథకాన్ని తీసుకొచ్చినప్పుడు.. విద్య, వైద్యం విషయంలో ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషిని జయప్రకాశ్‌ నారాయణ అభినందించారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సంక్షేమ పథకాలు గడపగడపకూ అందుతున్నాయని అప్పట్లో జేపీ ప్రశంసించారు. ఇప్పుడు ఆయన జగన్‌తో ఒకే వేదిక విూద కనిపించడం, సీఎంతో మాట్లాడటం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. జగన్‌ సర్కారు చేస్తు?న్న మంచి పనులు నచ్చడం వల్లే జేపీ లాంటి వ్యక్తి కూడా జగన్‌ను కలిశారని వైసీపీ అభిమానులు చెబుతున్నారు.ఇదే సమయంలో టీడీపీకి చెక్‌ పెట్టడం కోసం జగన్‌ కొత్త స్కెచ్‌ వేశారనే ప్రచారం కూడా మొదలైంది. గత లోక్‌ సభ ఎన్నికల్లో మూడు స్థానాలు మినహా మిగతా చోట్ల వైఎస్సార్సీపీ విజయం సాధించింది. విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం సీట్లను మాత్రం టీడీపీ గెలుపొందింది. దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి విజయవాడ లోక్‌ సభ స్థానాన్ని గెలుచుకోవడానికి జగన్‌ కొత్త ప్లాన్‌ వేశారని.. జయప్రకాశ్‌ నారాయణను వైఎస్సార్సీపీ తరఫున విజయవాడ ఎంపీగా పోటీ చేయిస్తారనే ప్రచారం మొదలైంది. ఈ ప్రచారం నిజమైతే మాత్రం టీడీపీ ఉలిక్కిపడటం ఖాయమే. ఎందుకంటే.. జేపీకి వ్యక్తిగతంగా మంచి పేరుంది. పైగా ఆయన కృష్ణా జిల్లాకే చెందినవారు, కమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కూడా.జేపీ విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని గత ఏడాది నుంచే ప్రచారం జరుగుతోంది. కానీ అందుకోసం వైఎస్సార్సీపీలో చేరతారని అనుకోలేం. 2014 ఎన్నికల్లో మల్కాజ్‌గిరి ఎంపీగా పోటీ చేసి ఓడిన తర్వాత జేపీ రాజకీయాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఒకవేళ జేపీ లోక్‌ సత్తా తరఫున లేదా ఇండిపెండెంట్‌గా ఎంపీగా పోటీ చేస్తే.. ఆయనకు భారీగా ఓట్లు పడతాయనడంలో సందేహం లేదు. ఇది టీడీపీ ఇబ్బందికరం కాగా.. వైఎస్సార్సీపీకి కలిసొస్తుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *