బీజేపీకి చెక్ పెట్టేలా కేసీఆర్ గ్రౌండ్ వర్క్
తెలంగాణలో కేసీఆర్ వర్సెస్ ప్రతిపక్షాల మధ్య భీకర రాజకీయ పోరు సాగుతోంది. టీఆర్ఎస్ ను గద్దె దించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో కేసీఆర్ మాత్రం బీజేపీతో గట్టి తగాదానే పెట్టుకున్నారు. బీజేపీ దేశంలో విభజన రాజకీయాలు చేస్తోందని సందర్భం వచ్చిన ప్రతిసారి విరుచుకుపడుతున్నారు. బీజేపీనే టార్గెట్ గా కేసీఆర్ సాగిస్తున్న రాజకీయం ఇప్పుడు ఉత్కంఠను రేపుతోంది. అయితే బీజేపీని ఎదుర్కొనే విషయంలో కేసీఆర్ పక్కా హోం వర్క్ చేస్తున్నారనే ప్రచారం సోషల్ విూడియాలో సాగుతోంది. నిజానికి కేసీఆర్ తాను చేపట్టబోయే కార్యక్రమాలపై అనర్గళంగా మాట్లాడుతారు. ప్రతి అంశాన్ని స్మృశిస్తారు. ఈ నైపుణ్యమే కావొచ్చు కేసీఆర్ ను మిగతా రాజకీయ నాయకుల్లో ప్రత్యేకంగా నిలబెట్టేలా చేసేది. బీజేపీని జాతీయ స్థాయిలో ఎదుర్కోవాలని భావిస్తున్న కేసీఆర్ ఆ దిశగా కసరత్తు ప్రారంభించారు. తాజా ప్రగతి భవన్ లో కేసీఆర్ ముందు ఉన్న టేబుల్ పై కనిపించిన ఓ పుస్తకం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ విూడియాలో వైరల్ అవుతోంది.మోడీ, అమిత్ షాలను ఎదుర్కొనేందుకు ఉన్న అన్ని మార్గాలను కేసీఆర్ ఉపయోగించుకుంటున్నారు. రాజకీయ, భావజాల అంశాలను ప్రధాన అస్త్రంగా పావులు కదుపుతున్నారు. జాతీయ రాజకీయాల కోసం ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్య నేతలతో చర్చలు జరుపుతున్న కేసీఆర్.. ఇటీవల భావజాల అంశాలపై ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా బీజేపీ మహాత్మాగాంధీని కించపరుస్తోందని, ఇది వాంఛనీయం కాదని కేసీఆర్ ఇటీవల పరోక్షంగా బీజేపీ, దాని అనుబంధ సంస్ధలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. హెచ్ఐసీసీలో స్వాతంత్య్ర భారత వజ్రోత్సవ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడుతూ ఏ జాతి కూడా తన చరిత్రను తానే మలినం చేసుకోదని.. దేశంలో మహాత్ముడికే కళంకం తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఇలాంటి చిల్లర వేశాలు ఇక ఆపాల్సిందే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ నోటి వెంట వచ్చిన ఈ మాటల వెనుక పెద్ద కథ ఉందనే టాక్ వినిపిస్తోంది. సీఎం కేసీఆర్ ను టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కలిశారు. ఇటీవల తనపై జరిగిన హత్యాయత్నం వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డికి కేసీఆర్ ధైర్యం కోల్పోవద్దని సూచించారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను జీవన్ రెడ్డి సోషల్ విూడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో టేబుల్ పై ‘ఇండియా ఆఫ్టర్ గాంధీ’ ది హిస్టరీ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ అనే పుస్తకం కనిపించడం ఆసక్తిని రేపుతోంది. ప్రముఖ భారతీయ చరిత్రకారుడు రామచంద్ర గుహ రచించిన ఈ పుస్తకంలో స్వాతంత్య్రానంతరం ఆధునిక భారతీయ చరిత్రపై పండిత విశ్లేషణ ఆసక్తిని కలిగించే రీతిలో ఉంటాయని, ఈ పుస్తకాన్ని రచించడానికి గుహా అనేక భారతీయ ప్రముఖుల ప్రైవేట్ పేపర్లను, అలాగే న్యూ ఢల్లీిలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం మరియు లైబ్రరీలో ఉంచబడిన వార్తాపత్రిక రికార్డులను తిరగేశారని పుస్తక ప్రియులు చెబుతున్నారు. భారత స్వాతంత్య్ర ఉద్యమకారుడు మరియు రాజకీయ నాయకుడు సి.రాజగోపాలాచారి మరియు ఇందిరా గాంధీ ప్రధాన కార్యదర్శిని సంప్రదించి సేకరించిన సమాచారం ఈ పుస్తకంలో ఉన్నట్లు తెలుస్తోంది. గాంధీకి సంబంధించిన ఇటువంటి ఓ పుస్తకం కేసీఆర్ టేబుల్ పై కనిపించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. రాబోయే రోజుల్లో బీజేపీని భావజాల విషయంలో ఎదుర్కొనేందుకు కేసీఆర్ గట్టి ప్రయత్నమే చేస్తున్నారా? అందులో భాగంగానే ఇలాంటి పుస్తకాలను తిరగేస్తున్నారా? అనే సందేహాలు నెటిజన్ల నుండి వ్యక్తం అవుతోంది. కేసీఆర్ పుస్తక ప్రియుడనే సంగతి అందరికి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా గతంలో చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రగతి భవన్ లో కనిపించిన ఈ పుస్తకం చర్చనీయాంశం అవుతోంది.