తెలుగు రాష్ట్రాలకు వాయుగండం…

తెలుగు రాష్ట్రాలకు తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయుగుండానికి తోడు సముద్రమట్టానికి 7.6 కిలోవిూటర్ల ఎత్తులో కొనసాగుతున్న ఉపరితన ఆవర్తనంతో తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలలో పలు చోట్ల కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్ర, యానాంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. తీరం వెంట గంటకు 50 నుంచి 55 కిలోవిూటర్ల వేగంతో వీస్తాయనీ, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో ఆగస్టు 10 వరకు ఓ మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు ప్రకటించారు.ఇక తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. కొన్నిచోట్ల గంటకు 30 నుంచి 40 కిలోవిూటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. కొమరం భీమ్‌ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. నిర్మల్‌, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌ రూరల్‌, వరంగల్‌ అర్బన్‌, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని, ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌ జారీ అయిందని అధికారులు చెప్పారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *