సచివాల ఉద్యోగులకు జీతాల గండం

సీఎం జగన్‌ తన మానస పుత్రికగా ప్రకటించుకున్న వ్యవస్థ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులపై దారుణమైన వివక్ష చూపిస్తున్నారు. ఇప్పటికే వారికి విధి నిర్వహణలో లేనిపోని నిబంధనలు పెట్టి నానా తిప్పలు పెడుతున్నారు. ప్రొబేషన్‌ పేరుతో దాదాపుగా పది నెలలుగా టార్చర్‌ పెడుతున్నారు. ఇప్పుడు ప్రొబేషన్‌ కొంత మందికి ప్రకటించినా వారికి కొత్త జీతాలు రావన్న తాజా సమాచారాన్ని వ్యూహాత్మకంగా లీక్‌ చేశారు. వారి జీతాలు పెంచడానికి బడ్జెట్‌ కేటాయింపులు లేవని చెబుతున్నారు. దీంతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల గుండెల్లో రాయి పడినట్లు అవుతోంది. రెండున్నరేళ్ల నుంచి పదిహేను వేల రూపాయలకే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పని చేస్తున్నారు. పర్మినెంట్‌ అవుతుందని ఎదురు చూస్తున్నారు. కానీ రెండేళ్ల సర్వీస్‌ పూర్తయిన తర్వాత కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. అనేక రకాల ఆందోళనల తరవాత పరీక్షలని. .. మరొకటని లెక్కలేసి..కనీసం అరవై వేల మందిని పక్కన పెట్టి మిగతా వారికి ప్రొబేషన్‌ ఖరారు చేశారు. వారికయినా ఇప్పుడు ప్రొబేషన్‌ ఖరారయిన ప్రకారం జీతాలిస్తారా అంటే? కష్టమేననే సంకేతాలు పంపుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ఖరారు చేసి జీతాలివ్వాలంటే కొన్ని లాంఛనాలు ఉంటాయని.. హెడ్‌ అకౌంట్‌లో కేటాయింపులు ఉండాలని కానీ అవి లేవని ట్రెజరీ వర్గాలు బయటకు లీక్‌ చేశాయి. నెలాఖరుకు వచ్చిన తర్వాత ఇలా చెప్పడం ఏమిటన్నది గ్రామ , వార్డు సచివాలయ ఉద్యోగులకు అర్థం కాని విషయం. ప్రొబేషన్‌ ఖరారు విషయంలో చిత్తశుద్ది లేని శివపూజ తరహాలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. సచివాలయాల ఉద్యోగులకు వేతనాలకు బడ్జెట్‌ లేదని స్వయంగా ప్రభుత్వమే చెప్పకుండానే చెప్పేసింది. అంటే ఏన్నో వడపోతల తరువాత, ఆందోళనల తరువాత ప్రబేషన్‌ పొందినా వారికి పెరిగిన వేతనాలు వచ్చే పరిస్థితి లేదని తేలిపోయింది. ప్రొబేషన్‌ కోసమే రోడ్డెక్కిన సచివాలయాల ఉద్యోగులు పూర్తిగా విజయం సాధించలేదు. దాదాపు 60 వేల మందికి ప్రభుత్వం ప్రొబేషన్‌ ఇవ్వలేదు. పోనీ ఇచ్చిన వారికైనా పెరిగిన వేతనాలు ఇస్తుందా అంటే అదీ లేదని ఇప్పుడు చెబుతున్నారు. మాట తప్పను, మడమ తిప్పను అని గొప్పగా చెప్పుకునే జగన్‌.. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యగోలు విషయంలో ప్రతి సారీ మాట తప్పుతున్నారు.. మడమ తిప్పుతున్నారు. సచివాలయాల ఉద్యోగులు దాదాపు రెండున్నరేళ్లకు పైగా కేవలం 15 వేల రూపాయల వేతనానికి ఉద్యోగాలు చేస్తున్నారు.ప్రొబేషన్‌ విషయంలోనూ వారు నానా ఇబ్బందులూ పడ్డారు. పరీక్ష రాసి అందులో అర్హత సంపాదించి ఉద్యోగం సాధించుకున్న వారిని ప్రొబేషన్‌ కోసం మళ్లీ పరీక్ష అన్నారు. తొలుత ఉద్యోగాలు ఇచ్చే సమయంలో మాత్రం ప్రొబేషన్‌ కు మళ్లీ ఎటువంటి పరీక్షలూ అవసరం లేదనీ, ఆటో మేటిగ్గా వచ్చేస్తుందని ప్రకటించిన జగన్‌.. రెండున్నరేళ్ల తరువాత పరీక్ష రాసి అర్హత సాధించుకోవాలన్నారు. అలా కొత్త నిబంధనతో దాదాపు 60 వేల మందిని ప్రొబేషన్‌ కు అనర్హులుగా ప్రకటించారు. పోనీ అర్హులంటూ ప్రొబేషన్‌ ఇచ్చిన వారికైనా ప్రభుత్వం ప్రకటించిన విధంగా పెరిగిన వేతనాలు ఇస్తున్నారా అంటే అదీ లేదు. ఎందుకంటే అందుకు బడ్జెట్‌ లేదట.ప్రభుత్వ ఉద్యోగులుగా వారిని గుర్తించడానికి నిబంధనలు అంగీకరించవట. ఈ నెల నుంచి కొత్త వేతనాలు అందుకుంటామని ఎదురు చూస్తున్న సచివాలయాల ఉద్యోగులకు ట్రెజరీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ఇది. ఆ కారణంగా ఈ నెల కూడా గతంలోలా 15 వేల రూపాయల వేతనం మాత్రమే వస్తుందని ట్రెజరీ వర్గాలు సచివాలయాల ఉద్యోగులకు సమాచారం అందించాయి.ముందు మందు నిబంధనలన్నీ పూర్తి చేసి అరియర్స్‌ తో సహా వేతనాలిస్తామని ప్రభుత్వ వర్గాలు సచివాలయాల ఉద్యోగులకు చెబుతున్నాయి.సమస్యలున్నాయి కాబట్టి ఈ నెల మామూలు జీతమే తీసుకోండని.. వచ్చే నెల లేదా తరవాత ఏరియర్స్‌ ఇస్తామని ప్రభుత్వం బుజ్జగించే అవకాశం కనిపిస్తోంది. అయితే? ఉద్యోగులు మాత్రం నమ్మలేకపోతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *