భారత్‌ను ఓడిస్తే డేటింగ్‌కు వస్తా.. బంగ్లాదేశ్‌ ఆటగాళ్లకు హీరోయిన్ బంపర్ ఆఫర్

వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా జోరు మీద కనిపిస్తోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఆప్ఘనిస్తాన్, పాకిస్థాన్‌లపై వరుస విజయాలు సాధించింది. గురువారం బంగ్లాదేశ్‌తో తలపడనుంది. గత అనుభవాల దృష్ట్యా బంగ్లాదేశ్‌ను టీమిండియా లైట్ తీసుకునే అవకాశాలు లేవు. అన్ని జట్లపై ఎలా ఆడతామో.. బంగ్లాపైనా అలాగే ఆడతామని ఇప్పటికే రోహిత్ ప్రకటించాడు. అయితే టీమిండియా చేతిలో పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోవడం ఆ దేశ అభిమానులకు నచ్చలేదు. దీంతో బంగ్లాదేశ్‌పై భారత్ ఓడిపోవాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ నటి సెహర్ షిన్వారి బంగ్లాదేశ్ టీమ్‌కు బంపర్ ఆఫర్ ప్రకటించింది. గురువారం జరిగే మ్యాచ్‌లో టీమ్‌ఇండియాను బంగ్లాదేశ్ ఓడిస్తే.. ఆ దేశ ఆటగాడితో డేటింగ్‌కు వెళ్తానని సోషల్‌ మీడియాలో ప్రకటించింది.

ఈ మేరకు సోషల్ మీడియాలో నటి సెహర్ షిన్వారి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ‘భగవంతుడా.. టీమ్‌ఇండియాను బంగ్లాదేశ్ ఓడిస్తే ఢాకాకు వెళ్లి ఆ దేశ క్రికెటర్‌తో డిన్నర్‌ డేట్‌కు వెళ్తా’ అని సెహర్ షిన్వారి తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది. అయితే గతంలో సెహర్ షిన్వారి పలు వివాదాస్పద పోస్టులు పెట్టింది. ఈ ఏడాది ఆసియా కప్‌లో సూపర్‌-4 మ్యాచ్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్‌ ఓడిపోవడంతో కెప్టెన్ బాబర్‌ అజామ్‌, జట్టు సభ్యులపై కేసు పెడతానని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. పాక్‌ ఆటగాళ్లు క్రికెట్‌ ఆడటానికి బదులు దేశ ప్రజల ఫీలింగ్స్‌తో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా సెహరి షిన్వారి పాక్‌లోని సింధు ప్రావిన్స్‌లోని హైదరాబాద్‌లో జన్మించింది. ఆమె నటన వైపు వెళ్తానంటే తొలుత కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. అయినా పట్టువిడవకుండా తన కలను సాకారం చేసుకుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *