టీటీడీ, అటవీ శాఖలకు పెద్ద టాస్క్‌

తిరుపతి, ఆగస్టు 22
శేషాచలం అభయారణ్యంలోని క్రూరమృగాల బెడద ఇప్పుడు టిటిడికి పెద్ద టాస్క్‌ లా మారింది. నడక మార్గంలో చిన్నారులపై చిరుతల దాడితో కలవరపడుతున్న టిటిడికి ఇప్పుడు ఎలుగు బంటి వ్యవహారం మరో చాలెంజ్‌గా మారింది. మూడు చిరుతలను బంధించిన టిటిడి, అటవీ శాఖ లకు చిరుతల సమస్యే కాదు, ఎలుగు బంటి సంచారం కూడా చిరాకు పుట్టిస్తోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఎలుగుబంటి బందించేందుకు ఎక్స్‌పర్ట్స్‌ టీమ్‌ను టిటిడి రంగంలోకి దింపింది.శ్రీవారి దర్శనానికి నడక మార్గంలో కొండకు చేరే భక్తులకు భద్రతపై భరోసా ఇచ్చేందుకు టీటీడీ ఎన్నో అవస్థలు పడుతోంది. అలిపిరి నడక మార్గంలో ఇటీవల చిన్నారులపై జరిగిన చిరుత దాడులు తీవ్ర కలకలం సృష్టించగా.. టిటిడి శేషాచలం అభయారణ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏడుకొండలతో కూడిన శేషాచలం అడవులను ఎస్వీ అభయారణ్యంగా ప్రభుత్వం పాతికేళ్ళ క్రితమే ప్రకటించింది. 1998లో ఉమ్మడి చిత్తూరు కడప జిల్లాల పరిధిలోని శేషాచలం అడవులను ఎస్‌వి అభయారణ్యంగా ప్రకటించగా ఎన్నో వృక్ష జంతు జాతులకు నిలయంగా ఈ అటవీ ప్రాంతం ఉండి పోయింది. 67,541.31 హెక్టార్ల విస్తీర్ణంలోని శేషాచలం అడవుల్లో 52,597 హెక్టార్లు నోటిఫికేషన్‌ ప్రకారం శ్రీ వెంకటేశ్వర అభయారణ్యం పరిధిలో ఉంది. అభయారణ్యం పరిధిలోనే చిరుతలతో పాటు ఎలుగు బంట్లు, ఏనుగులు, అడవి కుక్కలు, అడవి పందులు, ముళ్ళ పందులు, నక్కలు, అడవి పిల్లులు, జింకలు, దుప్పిలు, కణతులతోపాటు ఎన్నో జీవరాసులు ఉన్నాయి.బయోస్పియర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ గా కూడా ప్రకటించిన శేషాచలం అటవీ ప్రాంతం నుంచి తరచూ బయటికి వస్తున్న క్రూర మృగాలు ఇప్పుడు నడక మార్గంలో శ్రీవారి భక్తులను హడలెత్తిస్తుండగా మ్యాన్‌ ఈటర్‌ గా మారిపోతున్నాయి. దీంతో క్రూర మృగాల నుంచి భక్తులను కాపాడేందుకు టీటీడీ, అటవీ శాఖలు ఆపరేషన్‌ ప్రక్రియను ప్రారంభించారు. ఇందులో భాగంగా 50 రోజుల్లోనే మూడు చిరుతలను బంధించి రెండు ఎస్వీ జూ కు, మరొక చిరుతను అటవీ ప్రాంతంలో వదిలిపెట్టిన అటవీ శాఖ ఇప్పుడు మరిన్ని చిరుతల వేటను కొనసాగిస్తోంది.చిరుతల సమస్య ఒక్కటే కాకుండా శ్రీవారి మెట్టు మార్గంలో భక్తుల కంటపడిన ఎలుగుబంటి ఇప్పుడు అంతటా సంచరిస్తోంది. అలిపిరి నడకమార్గం వరకు అలజడి చేస్తుంది. దీంతో ఎలుగుబంటిని బంధించేందుకు టీటీడీ ఎన్నో ప్రయత్నాలు చేపట్టింది. కెమెరా ట్రాప్‌ లను ఏర్పాటు చేసి ఎలుగుబంటిని గుర్తించే పనిలో పడిరది. ఎలుగుబంటిని బోన్లో బంధించేందుకు అవకాశం లేకపోవడంతో వల పన్ని పట్టుకునే పనిలో టీటీడీ 100 మందిని సిబ్బంది అహర్నిశలు పనిచేసేలా చర్యలు చేపట్టింది. ఎక్స్‌పర్ట్‌ టీమ్‌ను రంగంలోకి దింపింది. మరోవైపు డ్రోన్‌ టెక్నాలజీని ఉపయోగిస్తోంది.ఇక శేషాచలం అడవుల్లో చిరుతలను, ఎలుగు బంట్లను గుర్తించి బంధించేందుకు ఏకంగా 500 కెమెరా ట్రాప్‌ లు ఏర్పాటు చేసింది. అయితే ఎలుగు బంటి జాడ తెలిసినా బంధించడంలో సక్సెస్‌ కాలేకపోయిన టీటీడీ, ఫారెస్ట్‌ సిబ్బందికి ఎలుగుబంటి ఆపరేషన్‌ టాస్క్‌ లా మారిపోయింది.
కర్నూలు జిల్లాల్లోనూ ఆనవాళ్లు
రాష్ట్రానికి చెందిన నంద్యాల జిల్లా రుద్రవరం మండలం పెద్ద కంబలూరు సవిూపంలో రెండు చిరుతపులుల సంచారం చేస్తున్నాయి. దీంతో భయాందోళనలకు గురైన రైతులు, ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. సమాచారం అందించినా పట్టించుకోని ఫారెస్ట్‌ అధికారులు. పైగా అటవీ ప్రాంతంలో చిరుతపులలో వస్తూపోతూ ఉంటాయని అడవి శాఖ అధికారులు నిర్లక్ష్య సమాధానం చెప్పడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రుద్రవరం మండలంలోని పెద్దకంబలూరు గ్రామ సవిూపంలో రెండు చిరుత పులులు సంచరిస్తున్న నేపథ్యంలో రైతులు ఆవేదన ఇదీ..
నంద్యాల జిల్లా, రుద్రవరం మండలంలోని పెద్దకంబలూరు గ్రామ సవిూపంలో రెండు చిరుత పులులు సంచరిస్తూ ఉండడంతో రైతులు, ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గత మూడు రోజుల క్రితం శ్రీరంగాపురం గ్రామ సవిూపంలో చిరుత పులి సంచరించినప్పటికీ ఫారెస్ట్‌ అధికారులు చిరుత పులిని అడవిలోకి తిరిగి పంపించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మరికొన్ని చిరుతపులులు అటవీ సవిూప గ్రామాలైన పెద్ద కంబలూరు సవిూపంలోని పంట పొలాల్లో సంచరిస్తూ రైతులను గడగడలాడిస్తున్నాయి. చిరుత పులుల సంచారం గురించి రైతులు ఫారెస్ట్‌ అధికారులకు తెలియజేసినప్పటికీ వారు అటవీ సవిూపంలో చిరుత పులులు వస్తూపోతూ ఉంటాయని అంతమాత్రాన భయపడాల్సిన అవసరం లేదని నిర్లక్ష్య సమాధానం చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం తిరుమల అడవుల్లో ఓ బాలికపై చిరుత దాడి చేసి చంపడంతో అటవీ సవిూప గ్రామాల ప్రజలు చిరుతల సంచారం అంటేనే భయాందోళన చెందుతున్నారు. అటవీ సవిూపాన వందల ఎకరాల్లో మినుము, మొక్కజొన్న ,వరి తదితర పంటలు రైతులు సాగు చేశారు. ప్రస్తుతము తెలుగు గంగ కాలువ ద్వారా నీరు ప్రవహిస్తూ ఉండడంతో రైతులు పంటలకు నీరు పెట్టుకునేందుకు వెళ్ళటానికి భయాందోళన చెందుతున్నారు. పంట పొలాల్లో సంచరిస్తున్న చిరుత పులులను అడవుల్లోకి వెళ్లేలా ఫారెస్ట్‌ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు, ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. చిరుత పులులు సంచరిస్తున్నాయని సమాచారం అందించినప్పటికీ స్పందించని ఫారెస్ట్‌ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు ప్రజలు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *