కరీంనగర్ కాంగ్రెస్ లో గందరగోళం
కరీంనగర్, అక్టోబరు 4
తెలంగాణా రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న కరీంనగర్ నియోజకవర్గంలో నాయకుల తీరుతో కార్యకర్తలు దిక్కుతోచని స్థితికి చేరుతున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పలువురి పేర్లు వినబడుతున్న నేపథ్యంలో ఎవరి వద్దకు వెళ్తే ఇంకొకరు ఎలా రియాక్ట్ అవుతాకొ తెలియక తికమక పడుతున్నారు కాంగ్రెస్ పార్టీలో కరీంనగర్ జిల్లా నుండి ఢల్లీి వరకు ఎంతో మంది నాయకులు ఎన్నో పదవులు అలంకరించారు.ప్రధాన మంత్రిగా దేశానికి సేవలు అందించిన పీవీ నరసింహరావు, ఎమ్మెస్సార్, శ్రీపాద రావు,గుడిసెల వెంకటస్వామి, రత్నాకర్ రావు, చొక్కారావు ఇలా చెప్పుకుంటు పోతే కాంగ్రెస్ పార్టీలో కరీంనగర్ నుండి చక్రం తిప్పిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి కరీంనగర్ నియోజకవర్గం ప్రస్తుత పరిస్థితి గాడి తప్పిందని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.కరీంనగర్ జిల్లా కేంద్రంగా గతంలో ఢల్లీి వరకు చక్రం తిప్పిన నాయకుల్లో కీలక పాత్ర పోషించిన జీవన్ రెడ్డి జగిత్యాలకు పరిమితం కావడం,దుద్ధిళ్ల శ్రీధర్ బాబు కరీంనగర్ జిల్లా రాజకీయాలకు అంటిముట్టనట్టుగా వ్యవహరించడం,కరీంనగర్ నియోజకవర్గం నుండి రెండు సార్లు ఎంపీగా పోటీచేసిన పొన్నం ప్రభాకర్ ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థిగా హుస్నాబాద్ నుండి పోటీచేస్తుండడంతో సీనియర్ నాయకులలో పట్టించుకునే వారు కరువయ్యారు. దీంతో ఎమ్మెల్యే సీటును ఆశిస్తున్న వారిలో ఐక్యత లోపించి ఎవరి ప్రచారాలకు వారు పరిమితమయ్యారు.?కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా గంగుల కమలాకర్, బీజేపీ అభ్యర్థిగా బండిసంజయ్ పేర్లు ఖరారు కాగా , కాంగ్రెస్ పార్టీలో మాత్రం నలుగురైదురు ఆశావహులు ఎవరికి వారు తామే అభ్యర్థులుగా ప్రచారాలు చేసుకుంటున్నారు.దుద్దిళ్ల శ్రీధర్ బాబు శిష్యుడిగా పేరుగాంచిన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఇటీవలే బీజేపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన మైత్రి గ్రూప్స్ ఛైర్మైన్ కొత్త జయపాల్ రెడ్డి, బొమ్మకల్ సర్పంచ్ పురమల్ల శ్రీనివాస్, ఎమ్మెస్సార్ మనవడు మెన్నేని రోహిత్ రావు, చొక్కారావు మనవడు నిఖిల్ చక్రవర్తి , పీసీసీ సెక్రటరీ అంజన్ కుమార్, సిఎం కేసీఆర్ అన్న కూతురు రేగులపాటి రమ్యారావుతో పాటు పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రచారాలు చేసుకుంటున్నారు.ఎవరి స్థాయిలో వారు టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేసుకుంటూ ప్రచారంలో దూసుకు పోతున్నా అభ్యర్థి ఎవ్వరనేది తేల్చుకోలేక కిందిస్థాయి కార్యకర్తలు తంటాలు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరో ఒకరిని త్వరగా ప్రకటించి సీనియర్ నాయకులు దృష్టి సారిస్తే పార్టీకి పూర్వ వైభవం వస్తుందని స్థానిక నాయకులు చెబుతున్నారు.