అంతుచిక్కని పొత్తులు…
గుంటూరు, అక్టోబరు 6
ఏపీలో నెలకొన్న రాజకీయ వాతావరణం ఎవరికి అంతు చిక్కడం లేదు. ఎన్నికల్లో ఎవరు ఎవరితో కలిసి పోటీ చేస్తారనే విషయంలో ఇంకా స్ఫష్టత రావడం లేదు. టీడీపీ`జనసేన కూటమిలో బీజేపీ ఉంటుందో లేదోననే విషయం ఇప్పట్లో తెలేలా లేదు.ఆంధ్రప్రదేశ్లో విపక్షాల మధ్య పొత్తుల చిక్కుముడి ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. టీడీపీతో కలిసి జనసేన వెళుతుందని పవన్ కళ్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో జనసేనతో మైత్రి విషయంలో ఎలా ముందుకు సాగాలనే దానిపై ఏపీ బీజేపీ నాయకత్వం మల్లగుల్లాలు పడుతోంది. జనసేన విషయంలో ఎలాంటి వైఖరి అవలంబించాలనే దానిపై పార్టీ అధిష్టానం నుంచి స్పష్టత తీసుకోవాలని బీజేపీ కోర్ కమిటీ నిర్ణయించింది.తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టు అనంతరం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రకటనల గురించి మంగళవారం జరిగిన బీజేపీ ఏపీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో జనసేన`బీజేపీ పొత్తుపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు .సెప్టెంబర్ 14న ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ`జనసేన కలిసి ముందుకు వెళ్తాయని ప్రకటించారు. ఇప్పటికే బీజేపీ`జనసేన మధ్య పొత్తు ఉంది.. ఇప్పుడు టీడీపీ, జనసేనతో బీజేపీ కలిసి వస్తుందా? లేదా? అనే విషయాన్ని బీజేపీ వారే తేల్చుకోవాలని పవన్ పేర్కొన్నారు.. మరోవైపు బీజేపీ అధిష్టానమే పొత్తుల విషయం చూసుకుంటుందని బీజేపీ ఏపీ అధ్యక్షులు పురంధేశ్వరి చెబుతున్నారు.బీజేపీతో పొత్తులో ఉంటూనే టీడీపీతో కలిసి పోటీ చేస్తామని పవన్ ఎలా ప్రకటన చేస్తారనే అంశంపై బీజేపీలో అసహనం వ్యక్తం అవుతోంది. పవన్ ఎవరితో పొత్తులో ఉన్నారనే అంశంపై క్లారిటీ బీజేపీ ఇచ్చే ప్రయత్నం చేసింది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత పరిణామాలపై కూడా కోర్ కమిటీలో చర్చ సాగింది. పవన్ కల్యాణ్ చేసే ప్రతి కామెంట్పై తాను స్పందించాల్సిన అవసరం లేదని పురందేశ్వరి చెప్పారు. పొత్తులపై పవన్ కల్యాణ్ ప్రకటన.. ఆయన అభిప్రాయాలను జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తామని, పొత్తులతో పాటు పవన్ కామెంట్ల విషయంలో జాతీయ పార్టీ సూచనల మేరకు వ్యవహరిస్తామని పేర్కొన్నారు.పవన్ కల్యాణ్తో బీజేపీ పొత్తు కొనసాగుతుందా..? లేదా..? అనే అంశం పైనా జాతీయ నాయకత్వమే సమాధానం చెప్పాలన్నారు పురంధేశ్వరి.. పొత్తులపై పవన్ తన అభిప్రాయాన్ని చెప్పారు.బీజేపీ అభిప్రాయాన్ని జాతీయ నాయకత్వమే చెబుతుందన్నారు.తమది ప్రాంతీయ పార్టీ కాదని, జాతీయ పార్టీ కాబట్టి అన్ని నిర్ణయాలు అధిష్టానమే తీసుకుంటుందని స్పష్టం చేశారు. మరోవైపు పవన్ విషయంలో పార్టీ స్పష్టమైన నిర్ణయాన్ని చెప్పాల్సిన అవసరం ఉందని కొందరు నేతలు అభిప్రాయపడ్డారు. అవసరమైతే దిల్లీకి వెళ్లి జాతీయ నేతలతో చర్చిస్తే ఎలా ఉంటుందన్న దానిపైనా చర్చించారు. ఎన్డీఏలోనే ఉన్నట్లు పవన్ చెబుతున్నందున సంయమనం పాటించాలని సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు