వేలిముద్రల ద్వారా డబ్బులు మాయం

నెల్లూరు, జూన్‌ 28
నెల్లూరు జిల్లాలో సరికొత్త మోసం వెలుగు చూసింది. అకౌంట్లలోనుంచి డబ్బులు మాయమైపోతోందంటూ బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ వ్యవహారంపై దృష్టి పెట్టారు. చివరకు పరిశోధించి విషయం తేల్చారు. వేలిముద్రల ద్వారా డబ్బులు మాయం అవుతున్నట్టు గుర్తించారు. మరి బాధితులు వేలిముద్రలు వేయకుండానే ఇదంతా ఎలా జరుగుతోంది, ఆ డబ్బు ఎక్కడికెళ్తోంది, అసలా నిందితుల ప్లాన్‌ ఏంటి..?ఇదో సరికొత్త మోసం, మనకు తెలియకుండానే మన వేలిముద్రలు దొంగిలించి, మన ఆధార్‌ కార్డ్‌ ద్వారా మనకు సంబంధం లేకుండానే మన అకౌంట్లనుంచి డబ్బులు మాయం చేస్తున్నారు కేటుగాళ్లు. ఆధార్‌ ఎనేబుల్డ్‌ పేమెంట్‌ సిస్టమ్‌ ద్వారా ఈ మోసం జరుగుతోంది. ప్రస్తుతం పల్లెటూల్లలో బ్యాంకింగ్‌ కియోస్క్‌ లు ఏర్పాటు చేసి, ఆధార్‌ నెంబర్‌ చెప్పి, వేలిముద్ర వేస్తే డబ్బులు విత్‌ డ్రా చేసి ఇస్తారు, కొంత కవిూషన్‌ తీసుకుంటారు. అయితే దీన్ని అడ్డు పెట్టుకుని, అకౌంట్‌ హోల్డర్లకు తెలియకుండా డబ్బులు కాజేస్తున్నారు కొంతమంది. ఇలాంటి ఓ ముఠాను నెల్లూరు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో భూముల రిజిస్ట్రేషన్ల సమయంలో వేసే వేలి ముద్రలను దొంగిచించి వాటి ద్వారా వేలిముద్రల కాపీలు తయారు చేసి బ్యాంకుల్లో డబ్బులు కొట్టేస్తున్నారు. ఆధార్‌ నెంబర్లు కూడా రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లోనుంచే దొంగిలించారు. ఈ ముఠా ఇప్పటి వరకూ 51 లక్షల 25వేల రూపాయలు ఇలా దొంగిలించినట్టు గుర్తించారు. బాధితుల బ్యాంక్‌ అకౌంట్లనుంచి తమ వ్యాలెట్‌ లోకి డబ్బులు ట్రాన్స్‌ ఫర్‌ చేసుకుంటున్న నిందితులు, వెంటనే దాన్ని విత్‌ డ్రా చేసుకుంటున్నారు. దీంతో రికవరీ కష్టసాధ్యంగా మారింది. కర్నూలు జిల్లా రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ కి సంబంధించి డాక్యుమెంట్‌ రైటర్‌ గా పనిచేసే ఓ వ్యక్తి ఇందులో కీలక నిందితుడు. రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్‌ పనులకోసం వచ్చేవారు, సాక్షులుగా సంతకాలు చేసేవారు వేలిముద్రలు వేయడం, తమ ఆధార్‌ కాపీలు ఇవ్వడం పరిపాటి. దీని ద్వారా ఈ కేటుగాళ్లు వేలిముద్రలు, దానికి సంబంధించిన ఆధార్‌ కాపీలు స్కాన్‌ చేసేవారు. అలా స్కాన్‌ చేసిన వేలిముద్రలతో బ్యాంకింగ్‌ కియోస్క్‌ టెక్నాలజీతో డబ్బులు కాజేసేవారు. బాధితుల్లో ఎక్కువమంది నిరక్షరాశ్యులు, పల్లెటూరివారే ఉన్నారు. ఎప్పటికప్పుడు సెల్‌ ఫోన్‌ లో బ్యాంక్‌ నుంచి వచ్చే మెసేజ్‌ లు చూడటం వారికి అలవాటు లేదు. అందుకే బ్యాంక్‌ ఖాతా నుంచి డబ్బు ట్రాన్స్‌ ఫర్‌ అయినా కూడా వారికి తెలియదు. దీంతో ఈ కేటుగాళ్ల పని సులభమైంది. తీరా ఓ బాధితుడి ఫిర్యాదుతో నెల్లూరు పోలీసులు తీగలాగి, డొంక కదిలించారు. ఇక్కడ నెల్లూరు జిల్లావారు బాధితులే అయినా, 10మంది నిందితులు జిల్లా బయటి వ్యక్తులు కావడం విశేషం. ఇతర జిల్లాల్లో వీరు పనులు చక్కబెట్టారు. ఆన్‌ లైన్‌ నుంచి కూడా కొంత డేటా సేకరించారని పోలీసులు అనుమానిస్తున్నారు. వ్యాలెట్‌ లో ఉన్న సొమ్ముని బ్లాక్‌ చేశామని, మిగతా సొమ్ము నిందితులనుంచి రికవరీ చేస్తామని చెబుతున్నారు పోలీసులు. ఇలాంటి మోసాలను నివారించాలంటే ఆధార్‌ తో అనుసంధానంగా ఉన్న ఫింగర్‌ ప్రింట్‌ ని డిజేబుల్‌ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. అలా చేస్తే మన వేలిముద్ర ఎవరికీ కనపడదని, వేలిముద్రలతో మన ఆధార్‌ ని ఎవరూ ఉపయోగించలేరని చెప్పారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *