రాజం పేటలో హాట్‌..హాట్‌ పాలిటిక్స్‌

కడప, అక్టోబరు 18
రాజంపేట తెలుగుదేశం పార్టీలో రాజకీయ వేడి రాజుకుంది. పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాల్లో కూడా పార్టీ టికెట్ల వ్యవహారంపై తీవ్ర చర్చ మొదలైంది. పార్టీ టిక్కెట్లు ఎవరిని వరిస్తాయోనన్న ఆసక్తి మొదలైంది. తాజాగా ఎవరూ ఊహించని విధంగా రాజంపేట పార్లమెంట్‌ అధ్యక్షుడిగా జగన్‌ మోహన్‌ రాజును నియమితులు అవడంతో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈయన నియామకం వెనుక అధిష్టానం వ్యూహం ఏంటి అన్నది అటు రాజంపేట పార్లమెంట్‌, ఇటు అసెంబ్లీ సెగ్మెంట్లలోను చర్చలు మొదలయ్యాయి. దీంతో ఇక్కడ అసెంబ్లీ సీటుకు పోటీ పడుతున్న వారి సంఖ్య ముగ్గురికి చేరింది.రాజంపేట పార్లమెంట్‌ అధ్యక్షుడిగా సోమవారం జగన్‌ మోహన్‌ రాజును నియమిస్తూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఈయన అసెంబ్లీ నుంచే పోటీ చేయాలన్న తలంపుతో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో కూడా జగన్‌ మోహన్‌ రాజు టికెట్‌ ఆశించారు. అప్పట్లో టికెట్‌ దక్కక పోవడంతో కొంత నిరాశ చెందారు. అయినా, పార్టీలో అంకితభావంతో పని చేస్తూ 2024 ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేయాలన్న తలంపుతో చురుగ్గా పని చేస్తున్నారు.ఎన్నికలు సవిూపిస్తున్న నేపథ్యంలో ఆయన రాజంపేట అసెంబ్లీ టికెట్‌ కోసం గట్టి ప్రయత్నాలు ప్రారంభించారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ కార్యక్రమాలు చేపడుతున్నారు. నాయకులను, కార్యకర్తలను కలుస్తూ వస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం అసెంబ్లీ ఇన్‌చార్జిగా ఉన్న చెంగల్‌ రాయుడు కాపు సామాజిక వర్గం నుంచి టికెట్‌ ఆశిస్తున్నారు. ఈయనతో పాటు జగన్మోహన్‌ రాజు కూడా టికెట్‌ బరిలో నిలిచారు. వీరిద్దరి మధ్య అసెంబ్లీ టికెట్‌ కోసం పోరు జరుగుతోంది.పొత్తులో భాగంగా జనసేనకు సీటు కేటాయిస్తారా అన్న మరో చర్చ కూడా జరుగుతోంది. ఇదిలా ఉంటే పార్లమెంట్‌ అభ్యర్థిగా ఇప్పటికే నరహరిని చంద్రబాబు ప్రకటించడం జరిగింది. కొంతకాలంగా ఆయన అసెంబ్లీపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అంతకు ముందు రాజంపేట పార్లమెంట్‌ అధ్యక్షుడిగా ఇప్పటివరకు పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి కొనసాగుతూ వచ్చారు. ఆయనను సుమారు ఏడాది క్రితమే కడప పార్లమెంట్‌ అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు.దాంతో పాటు శ్రీనివాస్‌ రెడ్డి సతీమణి మాధవిని కడప అసెంబ్లీ ఇన్‌చార్జిగా నియమించడంతో ఆమె కడప అసెంబ్లీ అభ్యర్థిగా ఖరారవుతారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజంపేట పార్లమెంట్‌ స్థానం మొదటి నుంచి కాపు సామాజిక వర్గానికి పట్టు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అధ్యక్షునిగా నియమించవచ్చు. కాగా, తాజా పరిణామాల నేపథ్యంలో రాజంపేట అసెంబ్లీ, పార్లమెంటు టికెట్‌ ఎవరిని వరిస్తుందోనన్న ఆసక్తి నెలకొని ఉంది.అధిష్టానం నిర్ణయం మేరకు నడుచుకుంటా. తెలుగుదేశం పార్టీ అధిష్టానం నన్ను పార్లమెంట్‌ అధ్యక్షుడిగా నియమించింది. అందుకు తగ్గట్టుగా పనిచేస్తా. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా. పార్టీ నాయకులందరితో సమన్వయంతో పటిష్టతకు కృషి చేస్తా. పార్లమెంట్‌ అభ్యర్థిగా తనను నియమించిన చంద్రబాబు నాయుడు, లోకేష్‌, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడులకు, రాజంపేట పార్లమెంట్‌ పరిధిలోని అసెంబ్లీ ఇన్‌చార్జీలు , నాయకులందరికీ కృతజ్ఞతలుఅంటూ చెప్పుకొస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *