‘చంటి’, ‘కలిసుందాం రా’, ‘లక్ష్మి’, ఇప్పుడు ‘సైంధవ్’ వీటి కథ ఏంటో తెలుసా

వెంకటేష్ (Daggubati Venkatesh) నటించిన ‘సైంధవ్’ #Saindhav టీజర్ ఈరోజు విడుదలైంది. దీనికి శైలేష్ కొలను (SaileshKolanu) దర్శకుడు, వెంకట్ బోయినపల్లి (VenkatBoyinapalli) నిర్మాత. ఇది వెంకటేష్ కి 75వ సినిమా. అందుకనే ఈ సినిమా ఒక ప్రతిష్టాత్మకంగా నిర్మించారు అని అర్థం అవుతోంది. ఇందులో వెంకటేష్ తో పాటు, శ్రద్ధా శ్రీనాథ్ (ShraddhaSreenath), ఆర్య, నవాజుద్దీన్ సిద్ధిఖీ (NawazuddinSiddhique), రుహానీ శర్మ (RuhaniSharma) కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈరోజు విడుదలైన టీజర్ చాలా ఆసక్తికరంగా వుంది. ఈ టీజర్ లో ఈ సినిమా కథని కొంత వరకు చెప్పగలిగారు అని తెలుస్తోంది.

నవాజుద్దీన్ సిద్ధిఖీ మాదక ద్రవ్యాలు సరఫరా చేయడమే కాకుండా, చిన్న పిల్లలకి శిక్షణ ఇచ్చి వాళ్ళని సంఘ వ్యతిరేక శక్తులుగా కూడా తయారు చేస్తూ ఉంటాడు. ఆలా చేస్తున్న ఈ ముఠాని అడ్డుకునేందుకు వెంకటేష్ రంగంలోకి దిగుతాడు అని అర్థం అవుతోంది. అంతే కాకుండా ఈ సినిమా నేపధ్యం చిన్న పిల్లలతో కూడి ఉండటం, వెంకటేష్ కుమార్తె కూడా ఉండటం, ఇందులో భావోద్వేగాలకు కూడా చాలా ప్రాముఖ్యం ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ లో వెంకటేష్ మాట్లాడుతూ చాలా కాలం తరువాత తను ఒక సినిమాతో వస్తున్నాను అని, ఇది ఒక మంచి సినిమా అని చెప్పాడు. దర్శకుడు శైలేష్ కథ చెప్పగానే, ఇది కొంచెం వైవిధ్యం తో ఉండటం వలన, వెంటనే ఒకే చెప్పేసాను అని చెప్పారు వెంకటేష్. తన సినిమాలు ‘చంటి’, ‘కలిసుందాం రా’, ‘లక్ష్మి’ అవన్నీ సంక్రాంతి పండగకి విడుదలయ్యి పెద్ద విజయం సాధించాయని, ఇప్పుడు మళ్ళీ ‘సైంధవ్’ తో సంక్రాంతికి వస్తున్నాను అని చెప్పారు. అలాగే తన మొదటి సినిమా నుండి ఇప్పుడు 75వ సినిమా వరకు ఆదరిస్తున్న తన అభిమానులకు కృతజ్ఞతలు చెప్పారు.

ఈ సినిమా చాలా బాగుంటుంది అని, పండగకి అందరూ ఈ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు అని, చాలా సంవత్సరాల తరువాత ఒక యాక్షన్, భావోద్వేగాలు కల సినిమా చేస్తున్నాను అని, ఇది అందరికీ నచుతుంది అని అనుకుంటున్నాను అని చెప్పారు వెంకటేష్. ఈ సినిమా ముందుగా డిసెంబర్ 22న విడుదల చెయ్యాలని అనుకున్నారు, కానీ ఆ సమయంలో ప్రభాస్ (Prabhas) నటించిన ‘సలార్’ #Salaar వస్తుండటంతో ఈ సినిమాని సంక్రాంతికి అంటే జనవరి 13 న విడుదల చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *