వార్డు పాలనలతో .. జనాల్లోకి…

మహానగరంలోనున్న 150 వార్డుల్లో వార్డుల వారీగా పరిపాలన, పౌరసేవల నిర్వహణను మెరుగుపరిచేందుకు వార్డు పరిపాలనపై జీహెచ్‌ఎంసీ ముందడుగులు వేస్తుంది. వార్డు ఆఫీసు ఏర్పాటుకు సంబంధించి ఆఫీసులు ఏర్పాటు చేయకముందే వార్డు ఆఫీసుల వారీగా 150 మంది శానిటరీ జవాన్లను వార్డు శానిటేషన్‌ ఆఫీసర్లుగా నియమిస్తూ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మరో వైపు శాశ్వత ప్రాతిపదికన వార్డు ఆఫీసుల ఏర్పాటు కోసం డిప్యూటీ కమిషనర్లు స్థలాలను గుర్తించటంలో నిమగ్నం కాగా, వార్డు ఆఫీసర్‌కు కిందిస్థాయి సిబ్బందిని నియమించటంలో ఉన్నతాధికారులు బిజీగా ఉన్నారు.వచ్చే నెల 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ఒక్క వార్డు ఆఫీసునైనా, పూర్తిస్థాయి సిబ్బందితో పరిపాలన మొదలయ్యేలా చర్యలు చేపట్టారు. వార్డు కమిటీలుగా వ్యవహరించనున్న కార్పొరేటర్‌కు వార్డు ఆఫీసులో ఎలాంటి హోదా కల్పించాలన్న విషయంపై ఇంకా కసరత్తు కొనసాగుతుంది. వార్డు శానిటేషన్‌ ఆఫీసర్లుగా నియమితులైన 150 మంది జవాన్లు కాకుండా, శానిటేషన్‌తో పాటు హెల్త్‌ తదితర వ్యవహారాలను చూసుకునేందుకు వార్డుకు మరో ప్రత్యేక ఆఫీసర్‌ను కూడా నియమించాలా? అన్నదానిపై తుది నిర్ణయం తీసుకోవల్సి ఉన్నట్లు సమాచారం.150 మంది శానిటరీ జవాన్ల నియామకాలు కూడా ఇష్టారాజ్యంగా జరిగినట్లు, కనీసం తమ అభిప్రాయం తీసుకోకుండా నియమించాలని కొందరు జవాన్లు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమను శానిటేషన్‌ ఆఫీసర్లుగా నియమించటంపై చేసిన హడావుడి డిప్యూటేషన్‌ గడువు ముగిసినా, ఇంకా ఇక్కడే తిష్టవేసిన అధికారులను తమ మాతృశాఖకు పంపటంపై చూపాలని బదిలీ అయిన పలువురు జవాన్లు వాదిస్తున్నారు. ఈ నియామకాల్లో కూడా అధికారుల ఫేవర్‌గా ఉండే యూనియన్‌ నేతలుగా వ్యవహరిస్తున్న జవాన్లకు ఈ నియామకం నుంచి మినహాయింపు ఇచ్చారన్న వాదనలు సైతం ఉన్నాయి.ఇదిలా ఉండగా 150 మంది జవాన్లను వార్డు శానిటేషన్‌ ఆఫీసర్లుగా ఈ నెల 10న నియమించిన కమిషనర్‌ ఆ మరుసటి రోజు నుంచి 17 వరకు సెలవుల్లో వెళ్లటం కూడా చర్చనీయాంశంగా మారింది. తనకు ఇష్టం లేకపోయినా, అది నిబంధనలకు విరుద్దంగా ఉన్నా, సర్కారు ఒత్తిడితో గతంలో కొన్ని పనులు చేసిన కమిషనర్‌ ఆ తర్వాత కొన్ని రోజులు సెలవుల్లో వెళ్లిన సందర్భాలు మరికొన్ని ఉన్నాయిఇప్పటికే చాలా డివిజన్లలో జీహెచ్‌ఎంసీ వార్డు ఆఫీసులున్నా, కనీసం అవి ఎక్కడున్నాయన్న విషయం కార్పొరేటర్లకు తెలియదు. దీనికి తోడు సర్కిల్‌ స్థాయిలో పనిచేసే డిప్యూటీ కమిషనర్లు, మెడికల్‌ ఆఫీసర్లు, ఇంజినీర్లతో వీరికి సమన్వయం అంతంతమాత్రమే. ఈ క్రమంలో సర్కిల్‌ పాలనకు సమాంతరంగా మరో వ్యవస్థ రావటంతో ప్రజాపతినిధులు, అధికారుల మధ్య సమన్వయం కుదురుతుందా? కనీసం పౌరసేవల నిర్వహణ మెరుగుపడుతుందా? లేక సర్కిల్‌స్థాయి వ్యవస్థగా వార్డు ఆఫీసు పాలన కూడా అవినీతికి మరో వేదికవుతుందా? వేచి చూడాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *