60 రూపాయిలకు చేరిన బియ్యం

విజయవాడ, ఆగస్టు 23
విదేశాలకు బియ్యం ఎగుమతులను నిషేధించిన విషయం అందరికీ తెలిసిందే.అయితే ఈ నిషేధంతో రైతుల నుంచి కొనుగోలు చేసే ధాన్యం ధరలు కాస్త తగ్గాయి. బియ్యం ధరలు మాత్రం అస్సలే తగ్గడం లేదు. తగ్గడం మాట పక్కన పెడితే రెండు నెలల క్రితంతో పోలిస్తే మరింత పెరిగాయి. సన్న బియ్యం ధర కిలో 60 రూపాయల నుంచి 63 రూపాయల మధ్యకు చేరింది. మధ్యరకం బియ్యం ధర కూడా కిలో 50 పైనే ఉంది. అలాగే బియ్యంతో పాటు పప్పుల ధరలు కూడా మరింత పెరిగాయి. ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో బియ్యం ధరలు తగ్గడం లేదు. అనేక రకాల బ్రాండ్ల పేరుతో మార్కెట్లో ఇష్టానుసారం అమ్మకాలు చేపడుతున్నారు. మంచి కందిపప్పు కొనాలంటే కిలో 160 రూపాయల నుంచి 180 రూపాయల వరకూ పలుకుతోంది. 2018 ఆగస్టు నెలతో పోలిస్తే బియ్యం ధర 30 శాతం పెరిగింది. అలాగే కంది పప్పు ధర 146 శాతానికి దూసుకొచ్చింది. ఇక మినుముల ధర కూడా గతంతో పోలిస్తే.. కిలో 20 రూపాయలకు పెరిగింది. ప్రతీ నెలా పెరుగుతున్న ధరలతో పేద, మధ్య తరగతి కుటుంబాలపై మరింత భారం పడుతోంది. ప్రస్తుతం సర్కారు రేషన్‌ దుకాణాల ద్వారా రాయితీ కందిపప్పు ఇవ్వడం లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది.75 కిలోల ధాన్యం బస్తా ధర రెండు నెలల కిందటితో పోలిస్తే.. 100 రూపాయల వరకు తగ్గింది. రైతుల నుంచి 1800 రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారు. నాణ్యమైన రకాలు అయితే 2450 రూపాయల వరకు ఉన్నాయి. ఎన్నికల ఏడాది కావడంతో.. ఇక పెరిగే అవకాశం లేదని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇందుకు అనుగుణంగా బియ్యం ధరలు కూడా కిలోకు రూ.3 వరకు తగ్గాల్సి ఉంది. అయితే ఎక్కడా ఆ పరిస్థితే కనిపించడం లేదు. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంతో పాటు నెల్లూరు, నంద్యాల, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల సన్నబియ్యం కిలో రూ.63 వరకు విక్రయిస్తున్నారు. పట్టణాల్లో బ్రాండెడ్‌ రకాల బియ్యం కిలో ధర 60 రూపాయల వరకు ఉంది. ఇక 26 కిలోల బస్తా అయితే రెండు నెలల క్రితం 1,350 రూపాయల నుంచి 1400 వరకు ఉండగా.. ఇప్పుడు 1,500 నుంచి 1,600 వరకు అమ్ముతున్నారు. సన్నబియ్యంలోనే తెలుపు, మసర వంటి తదితర రకాలు ఉన్నాయి. పాలిష్‌ బియ్యంతో పోలిస్తే ఇవి కిలోకు మూడు రూపాయల నుంచి నాలుగు రూపాయల వరకు తక్కువగా ఉంటాయి. అన్ని సరుకుల ధరలు పెరగడంతో 50 రూపాయల నుంచి 54 రూపాయల మధ్యకు చేరాయి. మరోవైపు కందిపప్పు ధరలు కూడా విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి. దుకాణాలు, గ్రావిూణ ప్రాంతాల్లో కిలో 160 రూపాయల నుంచి 170 మధ్య విక్రయిస్తున్నారు. 2023 జనవరి నాటితో పోలిస్తే కిలోకు 50 రూపాయలకు పైగా పెరిగింది. మధ్యరకం కందిపప్పు కూడా కిలో 150 రూపాయల నుంచి 160 రూపాయల వరకు పలుకుతోంది. రాష్ట్రంలో కంది సాధారణ విస్తీర్ణం 6.30 లక్షల ఎకరాలు కాగా.. 2.57లక్షల ఎకరాల్లోనే పంట వేశారు. ధరలు పెరగడానికి ఇది కూడా ఓ కారణమేనని అధికారులు చెబుతున్నారు. రేషన్‌ దుకాణాల ద్వారా కందిపప్పు పంపిణీపై తెలంగాణ సర్కారు చేతులు ఎత్తేసింది. కిలో పప్పు కూడా ఇవ్వలేమంటూ ప్రభుత్వం చెబుతోంది. 2018లో కార్డుకు 2 కిలోలు చొప్పున కిలో కందిపప్పు 40 రూపాయల రాయితీతో ఇచ్చేది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక కిలో ధర 67 రూపాయలకు చేసి కార్డుకు కిలో చొప్పునే ఇవ్వాలని నిర్ణయించింది. మూడు నెలలుగా అది కూడా ఇవ్వడం లేదు. జూన్‌, జులై నెలల్లో ఇవ్వాల్సిన కందిపప్పు కూడా కలిపి ఒక్కో కార్డుపై రెండు కిలోలు ఇస్తామన్న మంత్రి నాగేశ్వరరావు మాటలు అలాగే మిగిలిపోయాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *