ఆన్సర్లు చెప్పలేని టీఎస్పీసీసీ టాపర్‌

టీఎస్పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో మరో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. టీఎస్పీఎస్సీ బోర్డు పరీక్షల ప్రశ్నా పత్రాల లీకేజీ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్‌ అధికారులకు ఏఈఈ పరీక్ష రాసిన ఓ అభ్యర్థి షాకిచ్చాడు. పరీక్షలో టాపర్ల జాబితాలో ఉన్న సదరు అభ్యర్థి పదో తరగతి పిల్లలు సైతం టక్కున జవాబు చెప్పే ప్రశ్నకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలాడు. విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన సిట్‌ అధికారులు గ్రూప్‌1, ఏఈఈ, డీఏఓ పరీక్షల్లో టాప్‌ మార్కులు సాధించిన అభ్యర్థులను విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏఈఈ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన ఓ అభ్యర్థిని సిట్‌ అధికారులు (ఏGబీ)2 ప్రశ్నకు జవాబు చెప్పామన్నారు. అయితే, సదరు అభ్యర్థి నాకు సమాధానం తెలియదని చెప్పటంతో సిట్‌ అధికారులు బిత్తర పోయినట్టు సమాచారం. మరో ఇరవై ప్రశ్నలు అడుగగా అభ్యర్థి రెండిరటికి కూడా జవాబు చెప్పలేదని తెలిసింది.వరంగల్‌ జిల్లాకు చెందిన విద్యుత్‌ శాఖ డీఈ పేరు కొత్తగా వెలుగులోకి వచ్చింది. విద్యుత్‌ శాఖ డీఈ కనుసన్నల్లో ఏఈ పేపర్‌ చేతులు మారినట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో విద్యుత్‌ శాఖ జూనియర్‌ అసిస్టెంట్‌ రవికిషోర్‌ను సిట్‌ అరెస్ట్‌ చేసింది. ఆయన 20 మందికి పశ్నాపత్రాలు విక్రయించినట్లు సిట్‌ బృందం గుర్తించింది. డీఈ ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లో ఓ కోచింగ్‌ సెంటర్‌లో శిక్షకుడిగా పనిచేస్తున్నాడని, అభ్యర్థులతో పరిచయం పెంచుకుని ఈ దందాకు తెరలేపినట్లు సిట్‌ అధికారులు గుర్తించారు. టాప్‌ మార్కులు వచ్చిన వారి వివరాలను సిట్‌ బృందం సేకరిస్తోంది. కాగా, ప్రశ్నపత్రాల లీకేజి కేసులో సిట్‌ అధికారులు గురువారం మరో ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేయగా, దీంతో ఈ కేసులో నిందితుల సంఖ్య 43కి, అరెస్ట్‌ అయిన వారి సంఖ్య 42కు చేరింది. ఈ వ్యవహారంలో సూత్రధారులుగా ఉన్న కమిషన్‌ మాజీ ఉద్యోగులు పులిదిండి ప్రవీణ్‌కుమార్‌, రాజశేఖర్‌రెడ్డి ద్వారా అనేక ప్రశ్నపత్రాలు ఒకప్పుడు కమిషన్‌లో పని చేసిన వీరి స్నేహితుడు సురేశ్‌కు చేరాయి.వీటిలో అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ), డివిజినల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (డీఏఓ) పేపర్లను తన అపార్ట్‌మెంట్‌లో నివసించే వారికి మధ్యవర్తి ద్వారా విక్రయించాడు. ఈ వ్యవహారంలో నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పూల రవికిశోర్‌ మధ్యవర్తిగా వ్యవహరించాడు. సురేశ్‌ గతంలోనే అరెస్టు కాగా.. రవికిశోర్‌తోపాటు ఏఈ, డీఏఓ పేపర్లు ఖరీదు చేసిన అన్నాచెల్లెళ్లు రాయపురం విక్రమ్‌, దివ్యలను అరెస్టు చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *