కాపు కార్పొరేషన్‌ లో ఆవినీతి మరకలు

విజయవాడ, జూన్‌ 28
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ కాపు భవన్‌ లు నిర్మిస్తామని, ఇప్పటికే విజయవాడ, విశాఖ, కర్నూలులో కాపు భవన్‌ ల నిర్మాణానికి నిధులు విడుదల చేశామని కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ అడపా శేషగిరిరావు చెప్పారు. కాపు కార్పోరేషన్‌ బోర్డ్‌ సమావేశం తాడేపల్లిలోని ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ అడపా శేషగిరి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా కాపు సంక్షేమానికి సంబంధించి జిల్లా, నియోజకవర్గాల వారీగా కమిటీల ఏర్పాటుకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేసినట్లు చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రభుత్వ పథకాల కింద కాపుల సంక్షేమానికి అందించిన లబ్ధిని లబ్ధిదారులకు వివరించే కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టనున్నట్లు తెలిపారు. కాపు సంక్షేమం కోసం అన్ని విధాలుగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే విజయవాడ కాపు భవన్‌ కు రూ. కోటి, విశాఖ, కర్నూల్‌ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసే కాపు భవన్‌ కు రూ. 50 లక్షల చొప్పున విడుదల చేశామని తెలిపారు.జగనన్న విదేశీ విద్యా దీవెన కింద ఇప్పటికే 42 మంది ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపించటం జరిగిందని కాపు కార్పోరేషన్‌ ఛైర్మన్‌ అడపా శేషు చెప్పారు. జగనన్న విదేశీ విద్యాదీవెన కు పెద్ద సంఖ్యలో ధరఖాస్తులు అందుతున్నాయని, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ అవినీతికి తావులేకుండా ధరఖాస్తులను పరిశీలించి అర్హులందరికి లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఒక్క కాపు కార్పొరేషన్‌ కు మాత్రమే కాకుండా అన్ని కార్పొరేషన్‌ లకు పెద్ద సంఖ్యలో విదేశీ విద్యా దీవెన అర్జీలు అందాయన్నారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌ వైపు చూస్తున్నాయని, సంక్షేమ ఫలాలు నేరుగా లబ్ధిదారులకు అందచేస్తుండటం గొప్ప విప్లవమని కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ అడపా శేషు అన్నారు. వాలంటీర్ల వ్యవస్థ, గ్రామ, వార్డు సచివాలయ ఏర్పటుతో అర్హలందరి ఇళ్ల వద్దకే వెళ్లి లబ్ధి అందేలా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవటం హర్షనీయమన్నారు. కుల, మత, ప్రాంత, పార్టీలు చూడకుండా లబ్ధిదారులకు నేరుగా లబ్ధిని అందిస్తున్నట్లు చెప్పారు. తుని 42 కేసులకు పైగా ఎత్తివేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో కాపు కార్పొరేషన్‌ లో జరిగిన అవినీతి పై చేపట్టిన విచారణ మరో 15 రోజుల్లో పూర్తవనుందని కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ అడపా శేషు చెప్పారు. కాపులకు నిధులు పేరుతో గత ప్రభుత్వంలోని కొందరు అవినీతికి పాల్పడినట్లుగా వచ్చిన ఆరోపణలు నేపద్యంలో విచారణ ద్వార పక్కా ఆధారాలను సేకరిస్తున్నామని అన్నారు. మరో వైపున నవరత్నాలతో సంబంధం లేకుండా కాపులకు మేలు చేయటానికే కాపు నేస్తంను తమ ప్రభుత్వం అమలు చేస్తుందని, కాపు నేస్తం ద్వారా మూడు పర్యాయాలు మొత్తం రూ. 1500 కోట్ల లబ్ధిని చేకూర్చినట్లు తెలిపారు. కాపు నేస్తం పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది కాపులకు మేలు జరిగిందన్నారు. ప్రభుత్వం పేదలకు అందిస్తున్న లబ్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రతి నియోజకవర్గంలోని లబ్ధిదారులతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *