జైస్వాల్ సెంచరీ, తిప్పేసిన బిష్ణోయ్.. నేపాల్‌పై టీమిండియా విజయకేతనం

ఏషియన్ గేమ్స్ 2023లో భారత జట్టు సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టింది. క్వార్టర్ ఫైనల్‌లో నేపాల్‌పై టీమిండియా 23 పరుగుల తేడాతో విజయకేతనం ఎగురవేసింది. యశస్వి జైస్వాల్(100) సెంచరీతో విధ్వంసం సృష్టించడంతో మొదట టీమిండియా భారీ స్కోర్ చేసింది. చివర్లో రింకూ సింగ్(37) మెరుపులు టీమిండియా స్కోర్ 200 దాటేందుకు సహకరించాయి. అనంతరం బౌలింగ్‌లో రవి బిష్ణోయ్(3/24), ఆవేష్ ఖాన్(3/32) చెలరేగడంతో నేపాల్ బ్యాటర్లు చేతులెత్తేశారు. భారత్ విసిరిన 203 పరుగుల భారీ లక్ష్య చేధనలో నేపాల్ జట్టు ఆరంభం నుంచే తడబడింది. భారత బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయిన ఆ జట్టు ఏ దశలోనూ లక్ష్యాన్ని చేధించేలా కనిపించలేదు. 4వ ఓవర్లో ఓపెనర్ ఆసిఫ్ షేక్(10)ను ఆవేష్ ఖాన్ పెవిలియన్ చేర్చాడు. దీంతో 29 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయిన నేపాల్.. పవర్ ప్లేలో 46 పరుగులు సాధించింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు చేయడానికి నేపాల్ బ్యాటర్లు శ్రమించాల్సి వచ్చింది. మరో ఓపెనర్ కుశాల్ భుర్టెల్‌ను(28) అరంగేంట్ర బౌలర్ సాయి కిషోర్ పెవిలియన్ చేర్చాడు.

ఆ తర్వాత 11వ ఓవర్లో స్పిన్నర్ రవి బిష్ణోయ్ రెండు వికెట్లు తీశాడు. కుశాల్ మల్లా(29), రోహిత్ పౌడేల్(3)ను ఔట్ చేశాడు. దీంతో మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చింది. 77 పరుగులకే నేపాల్ 4 వికెట్లు కోల్పోయింది. ఇలాంటి సమయంలో దీపేంద్ర సింగ్, సందీప్ జోరా ఐదో వికెట్‌కు 45 పరుగులు జోడించారు. మరోసారి చెలరేగిన రవి బిష్ణోయ్ 15వ ఓవర్లో ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. దీపేంద్ర సింగ్(32)ను పెవిలియన్ చేర్చడంతో 122 పరుగులకు నేపాల్ సగం వికెట్లు కోల్పోయింది. ఆ కాసేపటికే సందీప్(29)ను అర్ష్‌దీప్ సింగ్ పెవిలియన్ చేర్చాడు. దీంతో 140 పరుగులకు నేపాల్ 6 వికెట్లు కోల్పోయింది. డెత్ ఓవర్లలో భారత బౌలర్లు పరుగులు రాకుండా కట్టడి చేయడంతో వేగంగా ఆడే క్రమంలో నేపాల్ వరుసగా వికెట్లు కోల్పోయింది. చివరలో కరణ్ 2 సిక్సులు, ఒక ఫోర్ బాదడంతో కాస్త ఉత్కంఠ నెలకొంది. ఆవేష్ ఖాన్ వేసిన చివరి ఓవర్లో 30 పరుగులు అవసరం కాగా 6 పరుగులు మాత్రమే ఇచ్చి చివరి వికెట్‌ను తీశాడు. దీంతో నేపాల్ జట్టు 179 పరుగులకు ఆలౌటైంది. 23 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టింది. భారత బౌలర్లలో ఆవేష్ ఖాన్, రవి బిష్ణోయ్ మూడేసి వికెట్లు.. అర్ష్‌దీప్ సింగ్ 2, సాయి కిషోర్ ఒక వికెట్ తీశారు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ అద్భుత ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరు మొదటి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. యశస్వి జైస్వాల్ అయితే ఆరంభం నుంచే భారీ షాట్లతో రెచ్చిపోయాడు. వరుసగా ఫోర్లు, సిక్సులు బాదుతూ నేపాల్ బౌలర్లను అల్లాడించాడు. దీంతో టీమిండియా స్కోర్ బోర్డు ఎక్స్‌ప్రెస్ వేగంతో పరుగులు పెట్టింది. ఈ క్రమంలో జైస్వాల్ 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్ ధాటిగా ఆడుతుంటే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అతనికి సహకరించాడు. దీంతో టీమిండియా స్కోర్ బోర్డు 10 రన్ రేటుకు తగ్గకుండా దూసుకుపోయింది. ఈ క్రమంలో పవర్ ప్లేలోనే 63 పరుగులు వచ్చాయి. వీరి భాగస్వామ్యం 9.1 ఓవర్లలోనే 100కు చేరుకుంది. అయితే 10వ ఓవర్లో ఈ భాగస్వామ్యాన్ని దీపేంద్ర సింగ్ విడదీశాడు. భారీ షాట్‌కు ప్రయత్నించిన రుతురాజ్ గైక్వాడ్(25) రోహిత్ పౌడేల్‌కు దొరికిపోయాడు. దీంతో 104 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత తిలక్ వర్మ(2), జితేష్ శర్మ(5) సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *