మిస్సవుతున్న… వైసీపీ లాజిక్‌

రాజధానిలో పేదలు ఉండకూడదా అని ప్రశ్నిస్తూ.. రాజదాని కోసం ల్యాండ్‌ పూలింగ్‌లో రైతులు ఇచ్చిన భూముల్లో సెంటు స్థలాలను ప్రభుత్వం పేదలకు పంపిణీ చేస్తోంది. ప్రశ్నించిన విపక్షాలపై అదే ఎదురుదాడి చేస్తోంది. ఇంకా సుప్రీంకోర్టులోనూ అదే వాదన వినిపించింది. రాజధానిలో పేదలకు కేటాయించిన ఐదు శాతం భూముల్లోనే స్థలాలు ఇస్తున్నామని చెప్పింది. దీంతో న్యాయస్థానం కూడా తాము జోక్యం చేసుకోబోమని తెలిపింది. కానీ ప్రభుత్వ విధానం ప్రకారం ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ విశాఖ. మరి రాజధానిలో ఇళ్ల స్థలాలని సుప్రీంకోర్టుకు చెప్పడం ద్వారా అమరావతి రాజధానిగా ప్రభుత్వం అంగీకరించినట్లయిందన్న వాదన వినిపిస్తోంది. హైకోర్టు, సుప్రీంకోర్టులో రాజధానిలో పేదలకు స్థలాలు ఇస్తున్నామని ప్రభుత్వం చెప్పింది. రాజధానిలో పేదలకు చోటు లేదా అని వాదిందించింది. ఇదంతా రికార్డెడ్‌. ఈ కారణంగానే న్యాయస్థానాలు స్థలాల పంపిణీ విషయంలో జోక్యం చేసుకోబోమన్నాయి. అమరావతి అంశంపై హైకోర్టు తర్పుపై సుప్రీంకోర్టులో ప్రభుత్వం సవాల్‌ చేసింది. వచ్చే జూలైలో విచారణ జరగాల్సి ఉంది. అమరావతే రాజధాని అని ప్రభత్వమే అత్యున్నత న్యాయస్థానం ముందు ప్రభుత్వం స్థలాల విషయంలో స్పష్టం చేసింది. జూలైలో జరగబోయే విచారణలో అమరావతే రాజధాని అని పేదలకు భూములు పంచారు కదా అని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తే ప్రభుత్వం ఏం చెబుతుందన్న ప్రశ్న న్యాయనిపుణుల నుంచి వస్తోంది. రాజధానిలో అందరూ ఉండాలని పేదలకు రైతులు ఇచ్చిన భూములు ఇచ్చి ఇప్పుడు మళ్లీ రాజధాని విశాఖ అంటే.. అక్కడ భూములు కేటాయిస్తారా అనే మౌలికమైన ప్రశ్న సహజంగానే వస్తుందని చెబుతున్నారు. అమరావతి కూడా రాజధానే .. విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ చేస్తాం అనే వాదన వినిపించడానికి అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే.. సుప్రీంకోర్టులో జరుగుతోంది మూడు రాజధానులపై విచారణ కాదు. సీఆర్డీఏ చట్టం అమలు, ప్రభుత్వ ఉల్లంఘనలపై జరుగుతోంది. ఒప్పందం ప్రకారం రాజధానిని అమరావతిలోనే నిర్మించాలి. రైతులకు ఒప్పందం ప్రకారం కల్పించాల్సిన ప్రయోజనాలు కల్పించాలి. వాటిని అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. వాటిని అమలు చేయకుండా రాజధానిపై వేరే చట్టాలు చేయలేరని రిట్‌ ఆఫ్‌ మాండమస్‌ ఇచ్చింది. అంతే కానీ మూడు రాజధానుల బిల్లు కూడా ఉపసంహరించుకున్నందున ఆ ప్రస్తావన అసలు ఉండదని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు. అమరావతి కూడా రాజధానే అంటే చట్టప్రకారం చెల్లదు. సీఆర్డీఏ ఒప్పందం ప్రకారం రాజధాని అమరావతిగా నిర్దారించారు. ఒప్పందం చేసుకున్నారు. దాన్ని అమలు చేయాలి. లేకపోతే ప్రభుత్వం ప్రజలకు.. ముఖ్యంగా రైతులకు ద్రోహం చేసినట్లే అని విపక్షాలు గుర్తు చేస్తున్నాయి. మొత్తంగా పేదల ఇళ్ల స్థలాల పేరుతో ప్రభుత్వం చేసిన వాదనలు.. అంతిమంగా ప్రభుత్వ వాదనకు వ్యతిరేకంగా.. అమరావతి రాజధానికి మద్దతుగా ఉన్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. జూలైలో జరిగే విచారణలో ఇదే ప్రభుత్వానికి ఇబ్బందిగా మారితే వ్యూహాత్మ తప్పిదం చేసినట్లే అవుతుందని న్యాయవర్గాలు చెబుతున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *