ఫుల్‌ టైమ్‌ కలెక్టర్‌ కావలెను

తెలంగాణకు గుండెకాయ, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ జిల్లాకు రెగ్యులర్‌ కలెక్టర్‌ లేకపోవడంతో పాలనాపరమైన వ్యవహారాలు కుంటుపడుతున్నాయి. గత సంవత్సరం జూన్‌లో అప్పటి వరకు జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన శర్మణ్‌ పదవీ విరమణ చేశారు. దీంతో ఇన్‌చార్జి కలెక్టర్‌గా అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌కు బాధ్యతలు అప్పగించారు. అనంతరం రాష్ట్రంలో కలెక్టర్ల బదిలీలు జరిగినప్పటికీ అమోయ్‌ కుమార్‌ను మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాకు బదిలీ చేసి తిరిగి హైదరాబాద్‌ జిల్లాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇలా 11 నెలలుగా రెగ్యులర్‌ కలెక్టర్‌ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురౌతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు జిల్లాలకు ఒకే కలెక్టర్‌ కావడంతో హైదరాబాద్‌కు పూర్తి సమయం కేటాయించలేని పరిస్థితి ఉంది. దీంతో కలెక్టర్‌ కార్యాలయానికి పనుల నిమిత్తం వచ్చే ప్రజలతో పాటు ఇతర అన్ని విభాగాలలో పాలనాపరమైన సమస్యలు ఏర్పడుతున్నాయనే వాదనలున్నాయి.హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ప్రజావాణి కింద చేసిన ఫిర్యాదులకు సరైన పరిష్కారం లభించడం లేదని ఫిర్యాదుదారులు వాపోతున్నారు. కరోనా ప్రభావంతో 2020 నుంచి రెండేళ్లకు పైగా ప్రజావాణి కార్యక్రమాన్ని నిలిపివేశారు. అయితే గతంలో శర్మణ్‌ కలెక్టర్‌గా ఉన్న సమయంలో కార్యాలయానికి వచ్చే ఫిర్యాదుదారులను నేరుగా కలిసి వారి సమస్యలకు పరిష్కారం చూపేవారు. ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత ప్రజావాణి తిరిగి ప్రారంభమైనప్పటికీ దరఖాస్తులు బాక్సులకే పరిమితమయ్యాయనే ఆరోపణలు వినబడుతున్నాయి. దీంతో ఫిర్యాదుదారులు తమ సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్‌ కార్యాలయం చుట్టూ తిరగాల్సివస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు కార్యాలయంలో కలెక్టర్‌ సంతకం కోసం ఫైళ్లు పెండిరగ్‌లో ఉంటున్నాయని తెలిసింది. కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చిన రోజు పెండిరగ్‌ ఫైల్స్‌ చూడడం, ప్రజా ప్రతినిధులను కలవడం వంటివి జరుగుతుండడంతో సాధారణ ప్రజలు ఆయనను కలిసే అవకాశం లేకుండాపోతోంది. కిందిస్థాయి అధికారులతో సవిూక్షలు..ఇటీవలకాలంలో ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల కేటాయింపును వేగవంతం చేయడంతో పేదలు దరఖాస్తులు పట్టుకుని కలెక్టర్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. సంవత్సరాల క్రితం దరఖాస్తు చేసుకున్న వారితో పాటు కొత్తవారు కూడా చేతిలో కాగితాలలో పడిగాపులు గాస్తున్నారు. ఇన్‌చార్జి కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులను కలిసి తమ గోడును వెల్లబోసుకుంటున్నారు. అయితే పని ఒత్తిడి కారణంగా వారు కూడా ప్రజలకు పూర్తి సమయం కేటాయించలేకపోతున్నారు. రెగ్యులర్‌ కలెక్టర్‌ ఉన్నప్పుడే ప్రభుత్వ భూముల సంరక్షణ తలబొప్పిని కట్టిస్తుంది. అటువంటిది ఇన్‌చార్జి కలెక్టర్‌ ఉన్న సమయంలో వాటిని కాపాడడం కిందిస్థాయి అధికారులకు తలకుమించిన భారంగా పరిణమిస్తోంది. అంతేకాకుండా ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌, విద్యాశాఖ, రెవిన్యూ, బీసీ వెల్ఫేర్‌, ఎస్సీ, ట్రైబల్‌ వెల్ఫేర్‌, మైనార్టీ వెల్సేర్‌, ప్రభుత్వ వసతి గృహాల పర్యవేక్షణ, దళితబంధు, డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు వంటి అనేకశాఖలతో సవిూక్ష నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఈ సమావేశాలను చాలా సందర్భాలలో కిందిస్థాయి అధికారులు చేపడుతున్నారు. మరికొన్ని నెలల్లో శాసనసభ ఎన్నికలు కూడా జరుగనుండడంతో హైదరాబాద్‌ జిల్లాకు రెగ్యులర్‌ కలెక్టర్‌ అవసరం ఎంత ఉందనేది ప్రభుత్వం గుర్తించాల్సి ఉందని పలువురు ప్రజా ప్రతినిధులు సూచిస్తున్నారు.హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం తరలింపు కూడా ప్రహసనంగా మారుతోంది. ఇంకా నాంపల్లి రోడ్డులోని పాత కలెక్టర్‌ కార్యాలయం నుంచి లక్డీకాపూల్‌ కార్యాలయానికి పూర్తిస్థాయి తరలింపు జరుగలేదు. ఫైళ్ల తరలింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. దీంతో పనుల నిమిత్తం వచ్చే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. కలెక్టర్‌ కార్యాలయం తరలింపుతో పాటు రెగ్యులర్‌ కలెక్టర్‌ను నియమిస్తే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *