మరో కార్యక్రమానికి జగన్‌ శ్రీకారం

విజయవాడ, అక్టోబరు 6
వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ సింగిల్‌ గా పోటీ చేసి 175 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. సీఎం జగన్‌ కూడా వై నాట్‌ 175 నినాదంతోనే ముందుకెళ్తున్నారు. అంతేకాదు ప్రజల్లోకి వెళ్లినప్పుడు కూడా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు విూ కుటుంబానికి మంచి జరిగిందని అనిపిస్తేనే నాకు ఓటేయండని ధీమాగా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో పార్టీలకతీతంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించామని చెప్పుకొస్తున్నారు. దీంతో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమం రూపకల్పన చేసారు. అక్టోబర్‌ 11వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు వైసీపీ నేతలు. రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రిగా జగన్‌ ఎందుకు రావాలనే క్యాంపెయిన్‌ నిర్వహించున్నారు. దీనికి సంబంధించి నెల రోజుల పాటు క్యాంపెయిన్‌ నిర్వహించాలని నిర్ణయించారు. గత నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో జరిగిన సంక్షేమం, అభివృద్ది, సామాజిక న్యాయం వంటి అన్ని అంశాలను ప్రజలకు వివరించేలా ఈ క్యాంపెయిన్‌ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ వార్డు స్థాయి నాయకుల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకూ అందరూ పాల్గొననున్నారు. అయితే కార్యక్రమం ఎలా నిర్వహించాలి, ఏయే అంశాలపై ప్రజలకు వివరించాలి అనే దానిపై ముందుగానే రాష్ట్ర స్థాయి వర్క్‌ షాప్‌ నిర్వహించనుంది వైఎస్సార్‌ సీపీ. ఇప్పటికే గడప గడపకూ మన ప్రభుత్వం, జగనన్న సురక్ష, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లిన కేడర్‌.. వై ఏపీ నీడ్స్‌ జగన్‌ క్యాంపెయిన్‌ ద్వారా ప్రభుత్వం చేసిన సంక్షేమం, ఒక్కో కుటుంబానికి అందిన లబ్ది వివరాలు అందించడంతో పాటు గత ప్రభుత్వంలో ఎలాంటి పథకాలు అందాయనే దానిపై కూడా ప్రజలకు వివరించనున్నారు. ఇంత సంక్షేమం, అభివృద్ది అందించారు కాబట్టి మరోసారి జగన్‌ ను సీఎం చేయండని ప్రజలకు వివరించనున్నారు. తమ కుటుంబానికి మంచి జరిగిందని భావిస్తేనే ఓటు వేయండని కోరనున్నారు. ఇలా నెలరోజుల పాటు ఈ క్యాంపెయిన్‌ నిర్వహించనున్నారు వైసీపీ కేడర్‌.పార్టీ నాయకులను, కేడర్‌ మొత్తాన్ని సుమారు ఏడాదిన్నర కాలంగా ప్రజల మధ్యే ఉండేలా కార్యక్రమాలు రూపకల్పన చేసారు. ఎవరెవరు జనంలో తిరుగుతున్నారు. ఎక్కడెక్కడ ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది వంటి నివేదికలతో ఎప్పటికప్పుడు అలెర్ట్‌ అవుతున్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఒక్కో నియోజకవర్గంలోని అన్ని సచివాలయాల్లో పర్యటనలు పూర్తి చేసేలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లారు. ఈ కార్యక్రమం దాదాపు చివరి దశకు చేరుకుంది. దీంతో మరో రెండు కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లేలా ఏర్పాట్లు చేసారు. వీటిలో ఇప్పటికే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రారంభం అయింది. సీఎం జగన్‌ లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 45 రోజుల పాటు అధికారులు, పార్టీ నేతలు సమన్వయం చేసుకుంటూ ప్రతి ఇంటికీ వెళ్లేలా ఈ కార్యక్రమం రూపకల్పన చేసారు. దీనిద్వారా ప్రతి ఇంటిలో అందరి ఆరోగ్య పరిస్థితిపై రిపోర్టులు సిద్దం చేస్తున్నారు. అవసరం ఉన్నవారికి వైద్య పరీక్షలు, ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమం కొనసాగుతుండగానే అక్టోబర్‌ 11 నుంచి వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమం ప్రారంభించేందుకు వైఎస్సార్‌ సీపీ ఏర్పాట్లు చేస్తుంది. దీనికి సంబంధించి విధివిధానాలు కూడా దాదాపు సిద్దం చేసింది.సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ సీఎం జగన్‌ కూడా పార్టీపై ఫోకస్‌ బాగా పెంచారు. వచ్చే ఆరు నెలలు ఎంతో కీలకం అని ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఇంచార్జిలకు దిశా నిర్దేశం చేశారు. పూర్తి స్థాయిలో ప్రజల్లోనే ఉండాలని సూచించారు. అంతేకాదు త్వరలో సీఎం జగన్‌ కూడా జిల్లాల పర్యటన ప్రారంభించేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలిసింది. జగనన్న ఆరోగ్య సురక్ష, వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం, పార్టీ అంతా ప్రజల్లోనే ఉండేలా ముందుకెళ్తున్నారు. దీని ద్వారా ప్రజల్లో ప్రభుత్వంపై మరింత విశ్వాసం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. నేతలంతా గడప గడపకూ మన ప్రభుత్వం కొనసాగిస్తూ ఈ రెండు కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. కిందిస్థాయి కేడర్‌ కూడా జగనన్న ఆరోగ్య సురక్ష, వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. మొత్తంగా వచ్చే ఎన్నికల్లో మరోసారి విజయం సాధించేలా కేడర్‌ ను అన్ని రకాలుగా సమాయత్తం చేస్తూ వైసీపీ అధినేత జగన్‌ ముందుకెళ్తున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *