కన్నడిగులపై మోడీ ఆశలు
సుడిగాలి పర్యటనల్లో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ.. 22 ర్యాలీల్లో పాల్గొనబోతున్నారు… మే 2న మళ్లీ కర్ణాటక వస్తారు. 2, 3న ప్రచారం చేసి.. మళ్లీ ఢల్లీి వెళ్లి… తిరిగి మే 6, 7 కర్ణాటకలో ప్రచారం చేస్తారు.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంపై బీజేపీ చాలా భారీగా ఫోకస్ పెట్టింది అనేది ఒక అంశమైతే… ఓడిపోతామనే ఉద్దేశంతోనే… ఈ స్థాయిలో ప్రచారం చేస్తోంది అనేది మరో కోణం. రెండిరటినీ విశ్లేషించుకుందాం.బీజేపీకి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే… ఆ పార్టీ ఎన్నిక ఏదైనా దాన్ని ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటుంది. ప్రతీ ఎన్నికపైనా కింది నుంచి పై స్థాయి వరకూ అందరూ ఫోకస్ పెడతారు. ఇక పార్టీ అధికారంలో ఉన్న చోట అసెంబ్లీ ఎన్నికలు వస్తే ఊరుకుంటారా.. ప్రచార హోరు మామూలుగా ఉండదు. ఇప్పుడు కర్ణాటకలో జరుగుతున్నది అదేకర్ణాటక ఎన్నికల ప్రచారానికి మే 8 వరకే టైమ్ ఉంది. అంటే ఇవాళ్టి నుంచి 10 రోజులు మాత్రమే టైమ్ ఉంది. మే 10న ఎన్నికలు, 13న ఫలితాల ప్రకటన ఉంటుంది. అందువల్ల ఈ 10 రోజుల్లో జోరుగా ప్రచారం చేస్తే… ప్రజల్లోకి పార్టీని బలంగా తీసుకెళ్లినట్లు అవుతుందని బీజేపీ స్కెచ్ వేసింది. స్వయంగా ప్రధానితోనే ప్రచారం చేయించడం ద్వారా… రాష్ట్ర స్థాయిలో వస్తున్న అవినీతి ఆరోపణలను చిన్నవిగా చూపించినట్లు అవుతుందని ఆ పార్టీ భావిస్తోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ లాంటి వారు ప్రచారం చేస్తుండటంతో.. వారికి చెక్ పెట్టేందుకు ప్రధాని మోదీ రంగంలోకి దిగినట్లు కనిపిస్తోంది. ఐతే… ఇప్పటికే బీజేపీ తరపున అమిత్ షా, జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారం చేశారు.సర్వేలు చూస్తే.. ఈసారి కాంగ్రెస్కి కన్నడ ప్రజలు పట్టం కడతారని చెబుతున్నాయి. అదే సమయంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని అంటున్నాయి. వీటిని కొట్టి పారేస్తున్న బీజేపీ.. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి తీరతామని అంటోంది. అందుకు తగ్గట్టుగానే ప్రచారం తీరు ఉంది. మరి 224 స్థానాల్లో ప్రజలు ఎటువైపు నిలుస్తారన్నది ఆసక్తికరం.ఇదివరకు మోదీ ప్రచారం చేసిన చాలా రాష్ట్రాల్లో బీజేపీకి కలిసొచ్చింది. యూపీలో యోగి ఆదిత్యనాథ్ తరపున ప్రచారం చేసిన మోదీ.. డబుల్ ఇంజిన్ సర్కార్ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి.. తిరిగి భారీ మెజార్టీతో బీజేపీని గెలిపించారు. ఇప్పుడు కర్ణాటకలోనూ బసవరాజ్ బొమ్మై తరపున ప్రచారం చేస్తూ… డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదాన్ని మరోసారి తెరపైకి తేవాలనుకుంటున్నారు. అంతేకాదు.. కాంగ్రెస్ వస్తే… రివర్స్ గేర్ అవుతుందని సెటైర్స్ వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కన్నడ నాడి ఎలా ఉంటుంది అనేది దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది.ఈసారి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలకూ కలిపి మొత్తం 2,613 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఒక్క అధికార బీజేపీ మాత్రమే 224 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. ప్రతిపక్ష కాంగ్రెస్ 223 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టగా.. జేడీఎస్ నుంచి 207 మంది, ఆమ్ ఆద్మీ పార్టీ తరపున 209 మంది పోటీ పడుతున్నారు. బీఎస్పీ నుంచి 133 మంది, జేడీయూ నుంచి 8 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సిపిఐ నుంచి నలుగురు పోటీ పడుతుండగా.. స్వతంత్రులు 918 మంది ఉన్నారు. మే 10న ఎన్నికలు.. 13న ఫలితాలు రానున్నాయి