ధరణి..అక్రమాల పుట్ట…

హైదరాబాద్‌, జూలై 7
ధరణి పోర్టల్‌ జరిగిన అక్రమాలను జులై 15 తర్వాత బయటపెడతామని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. పూర్తి ఆధారాలతో ధరణి ఫైల్స్‌ విడుదల చేస్తామన్నారు. ధరణి పోర్టల్‌ అక్రమాలపై త్వరలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. ప్రజలకు, విూడియాకు ధరణికి సంబంధించి టెర్రాసిస్‌ కంపెనీ మాత్రమే కనిపిస్తోందని, కానీ దీని వెనక పెద్ద మాఫియా దాగుందని ఆరోపించారు. అందుకు సంబంధించి ధరణి ఫైల్స్‌ ను ఆధారాలతో సహా సీరియల్‌ గా బయటపెడతామన్నారు. ధరణి దోపిడీలపై అన్ని ఆధారాలతో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తామని పేర్కొన్నారు. ధరణిలో పెట్టుబడిదారులు ఎవరో కేంద్ర ప్రభుత్వం నిగ్గు తేల్చాలని బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డికి సవాల్‌ విసురుతున్నానని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ధరణి రూపంలో ప్రజల ఆస్తులు, భూములు, వ్యక్తిగత వివరాలు విదేశీయుల చేతుల్లోకి వెళ్తున్నాయని ఆయన ఆరోపించారు. ధరణి పోర్టల్‌ లో బ్రిటిష్‌ ఐల్యాండ్‌ కు సంబంధించిన పెట్టుబడులు ఉన్నాయని ఆరోపించారు. ధరణి మొత్తం కేటీఆర్‌ మిత్రుడు గాదె శ్రీధర్‌ రాజు చేతుల్లో ఉందన్నారు. దారిదోపిడీ దొంగలకంటే భయంకరమైన దోపిడీ ధరణిలో జరుగుతోందన్నారు. లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు మాయం అవుతున్నాయన్నారు. ధరణి పోర్టల్‌ నిర్వహణ విదేశీయుల చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆరోపించారు. అందరి వివరాలు విదేశీయుల గుప్పిట్లో ఉన్నాయని, ఇది అత్యంత ప్రమాదకరమని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.ధరణి పోర్టల్‌ నిర్వహిస్తున్న సంస్థలో పెట్టుబడి పెట్టిన వారు ఆర్థిక నేరగాళ్లు. ధరణి పోర్టల్‌ను నిర్వహిస్తున్న వారిలో విదేశీయులు ఉన్నారు. ధరణి పోర్టల్‌ ఏ దేశ పౌరుడి చేతిలో ఉందో, అతడు ఎలాంటివాడో, దావూద్‌ ఇబ్రహీం కంటే పెద్ద మాఫియా నాయకుడో, ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్‌ అమ్ముకునే డ్రగ్‌ లార్డో మనకు తెలియదు. ఈ పోర్టల్‌ ద్వారా మన వివరాలన్నీ విదేశీయుల చేతుల్లోకి వెళ్తున్నాయి. అనేక చేతులు మారి చివరకు.. ధరణి పోర్టల్‌ బ్రిటిష్‌ ఐల్యాండ్‌ చేతికి వెళ్లింది. ధరణిలోని అనేక లోటుపాట్లను ఆసరాగా తీసుకొని నిషేధిత జాబితాలోని భూములను అనుచరులకు రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్నారు. ప్రభుత్వ భూములను అనుచరులకు రిజిస్ట్రేషన్‌ చేసి వెంటనే ప్రొహిబిషన్‌ లాక్‌ చేస్తున్నారు. ధరణి పోర్టల్‌ మొత్తం కేటీఆర్‌ మిత్రుడు శ్రీధర్‌ గాదె చేతిలో ఉంది. శ్రీధర్‌ గాదె వద్ద ఉన్న తాళంతో ధరణిని ఎప్పుడైనా తెరవొచ్చు, ఒకరి పేరు విూద ఉన్న భూమిని మరొకరి పేరు విూద మార్చేయొచ్చు’’ అని రేవంత్‌ రెడ్డి వివరించారు.ప్రభుత్వ భూములకు యజమానులను సృష్టించడం, అనంతరం ఆ భూములను బదలాయించడం, ఆ తర్వాత వాటిని లేఅవుట్లు వేసి అమ్ముకోవడం… ఈ తతంగం ఇలా నడుస్తోందని రేవంత్‌ రెడ్డి వెల్లడిరచారు. ధరణి పోర్టల్‌ సాయంతో కేసీఆర్‌ కుటుంబం దోచుకుంటోందని అన్నారు. దీనికంతటికీ కారకుడు శ్రీధర్‌ గాదె అలియాస్‌ గాదె శ్రీధర్‌ రాజు అని ఆరోపించారు. హైటెక్‌ సిటీ ప్రాంతంలో క్వాంటెల్లా అనే సంస్థ పేరిట ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. కోదండరెడ్డి కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి అనేక భూ అక్రమాలు జరుగుతున్నట్టు ప్రాథమిక వివరాలు రాబట్టింది అని రేవంత్‌ రెడ్డి వివరించారు. దేవాదాయ భూములను అక్రమంగా ఫార్మా కంపెనీలకు కట్టబెట్టాలని చూశారని ఆక్షేపించారు. ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తానంటే కేసీఆర్‌ భయపడుతున్నారన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్‌ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ధరణిని రద్దు చేసి అంతకంటే మెరుగైన పోర్టల్‌ను తీసుకొస్తామన్నారు. కేసీఆర్‌ భూ అక్రమాలను కూడా బయటపెడతామన్నారు. ధరణిలో జరిగిన అక్రమాలను జులై 15 తర్వాత బయటపెడతామన్న రేవంత్‌ రెడ్డి… కేంద్రం తలచుకుంటే ధరణి వెనకున్న ఆర్థిక నేరాలను బహిర్గతం చేయొచ్చని పేర్కొన్నారు. గజ్వేల్‌ లో 1500 ఎకరాల అసైన్డ్‌ భూములను చట్టవిరుద్దంగా ప్రభుత్వం గుంజుకుందన్నారని మండిపడ్డారు. అమూల్‌ డైరీకి వందల ఎకరాల కట్టబెట్టారన్నారు.కేటీఆర్‌ దిల్లీ పర్యటనతో బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఫెవికాల్‌ బంధాన్ని బలోపేతం చేసేందుకు బీజం పడిరదని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎన్నికల అభ్యర్థులను మొట్టమొదట ప్రకటించాలని పార్టీలో చర్చలు జరిపామన్నారు. పేదల పక్షాన కాంగ్రెస్‌ ఉందని చాటే ప్రయత్నం చేసే దిశగా అధిష్టానం ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఈటల రాజేందర్‌ భద్రత పెంచినా… అనుమానితుడిపై ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. ఎవరి వల్ల ప్రమాదం ఉందో రాజేందర్‌ స్పష్టంగా చెప్పారని, అయినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కేసులు పెట్టలేదని నిలదీశారు. తన రక్షణ విషయంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోని ప్రభుత్వం…రాజేందర్‌ కు భద్రత ఏర్పాటు చేయడం సంతోషమని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.
1. ధరణిలో తప్పుల వలన లక్షల మంది రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ`వ్యవస్థను రద్దు చేసి దీని స్థానంలో భూమి వాస్తవ పరిస్థితికి అద్దంపట్టి, తప్పులు లేని, అందరికీ అందుబాటులో ఉండే కొత్త కంప్యూటర్‌ రికార్డును రూపొందిస్తాం. ఇప్పుడున్న రికార్డు సమస్యలను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి పరిష్కరిస్తాం.
2.నిషేధిత జాబితాలో చేర్చిన పట్టా భూములను కాంగ్రెస్‌ అధికారం లోకి వచ్చిన 100 రోజుల్లోగా తొలగిస్తాం.
3. అన్ని రకాల భూముల సమగ్ర సర్వే చేసి కొత్త రికార్డులు రూపొందిస్తాం. వ్యవసాయ భూములకు, ఇంటి స్థలాలకు కొత్త పట్టాలు ఇస్తాం. భద్రమైన హక్కులు కల్పిస్తాం.
4. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత జరిగే తొలి శాసన సభా సమావేశంలోనే కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా మేరకు టైటిల్‌ గ్యారంటీ చట్టం చేసి ప్రభుత్వమే భూమి హక్కులకు పూర్తి హావిూ ఇచ్చే వ్యవస్థను తెస్తాం.
5. వందకు పైగా ఉన్న భూచట్టాల స్థానంలో ఒకే భూమి చట్టం తెస్తాం.
6. కౌలుదారులకు రుణ అర్హత కార్డులు ఇచ్చేందుకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన అధీకృత సాగుదారుల చట్టాన్ని అమలు చేస్తాం.
7. కాంగ్రెస్‌ తెచ్చిన భూ సంస్కరణల ద్వారా ఇప్పటి వరకు పేదలకు పంచిన పాతిక లక్షల ఎకరాల భూములపై సంపూర్ణ హక్కులు కల్పిస్తాం.
8. 2006లో కాంగ్రెస్‌ తెచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి అర్హులందరికీ పోడు భూములకు పట్టాలు ఇస్తాం.
9. కేంద్రం లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టాన్ని యధాతథంగా అమలు చేస్తాం. రైతుల అనుమతి లేకుండా భూములు సేకరించం. అసైన్డ్‌ భూములకు, పోడు భూములకు కూడా పట్టా భూములతో సమానంగా నష్ట పరిహారం చెల్లిస్తాం. ఇప్పటి వరకు అలా నష్ట పరిహారం రాని వారికి న్యాయం చెయ్యడానికి రిటైర్డ్‌ జడ్జి ఆధ్వర్యం లో కమిషన్‌ ఏర్పాటు చేస్తాం.
10. భూపరిపాలన వ్యవస్థను బలోపేతం చేస్తాం. గ్రామ నుండి రాష్ట్ర స్థాయి వరకు సిబ్బందిని నియమించి రైతులకు హక్కుల చిక్కులు లేకుండా చేస్తాం.
11. భూ సమస్యల పరిష్కారానికి జిల్లాకొక భూమి ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేస్తామని రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ భూమి డిక్లరేషన్‌ లో అంశాలు తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *