వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు తొలి బంగారు పతకం

బుడాపెస్ట్: వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో భారత ఆశాకిరణ నీరజ్ చోప్రా స్వర్ణ చరిత్ర సృష్టించాడు. ఈ మెగా ఈవెంట్‌లో దేశానికి తొలి బంగారు పతకాన్ని అందించాడు. పోటీలకు చివరిరోజైన ఆదివారం రాత్రి జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ రెండో ప్రయత్నంలో గరిష్ఠంగా 88.17 మీటర్ల దూరం విసిరి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. తొలి ప్రయత్నం ఫౌల్ అయినా ఏమాత్రం తడబడకుండా మరో భారీ త్రోతో ప్రత్యర్థులకు సవాల్ విసిరాడు. మూడో త్రోలో 86.32 మీ విసిరిన నీరజ్.. నాలుగో ప్రయత్నంలో 84.64 మీ దూరానికి పడిపోయాడు. 2022లో జరిగిన చాంపియన్‌షిప్స్‌లో రజతం సాధించిన చోప్రా.. ఈసారి మెరుగైన ప్రదర్శనతో గోల్డ్ కొల్లగొట్టాడు. కాగా, ఫైనల్‌క అర్హత సాధించిన మరో ఇద్దరు భారత అథ్లెట్లు కిషోర్ జనా గరిష్ఠంగా 84.77 మీటర్లు విసిరి ఐదో స్థానంలో, డీపీ మను అత్యధకంగా 84.17 మీటర్లు విసిరి ఆరో స్థానంలో నిలిచారు. పాకిస్థాన్ త్రోయర్ అర్షద్ నదీమ్ 87.82 మీటర్లతో రజతం, చెక్ అథ్లెట్ జాకబ్ వాడ్లెజ్ 86.67 మీటర్లతో కాంస్యం దక్కించుకున్నారు. 2005లో లాంగ్ జంప్‌లో అంజూ బాబీ జార్డ్ కంచు పతకం సాధించింది

వాహ్ వా.. పారుల్: మహిళల 3000 మీటర్ల స్టీపుల్ చేజ్ ఫైనల్లో పారుల్ చౌదరి జాతీయ రికార్డ్ టైమింగ్ (9:15.31 సెకన్ల)తో 11వ స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో ఒలింపిక్ అర్హత టైమింగ్ 9:23.00 సెకన్ల అర్హత కూడా అందుకుంది. బెహ్రెయిన్ అథ్లెట్ విన్‌ఫ్రెడ్ ముటిలి 8.54.29 సె టైమింగ్‌తో స్వర్ణం నెగ్గగా.. కెన్యా రన్నర్లు బిట్రైస్ చెప్‌కోచ్, పెయిత్ చిరోటిచ్ రజత కాంస్యాలు సాధించారు. పురుషుల 5000 మీటర్ల రేసులో జాకబ్ ఇంజ్‌బ్రిక్‌స్టన్ (నార్వే) 13.11.30 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణం నెగ్గగా.. మమ్మద్ ఖతిర్ (స్పెయిన్), జాకబ్ క్రోప్ (కెన్యా) రజత, కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. మహిళ 800 మీటర్లలో కెన్యా రన్నర్ మేరీ మోరా 1:15.03 సెకన్ల టైమింగ్‌తో పసిడిని సొంతం చేసుకుంది. కీలీ హడ్జింగ్‌సన్ (బ్రిటన్) రజతం, అథింగ్ ము (అమెరికా) కాంస్యం దక్కించుకున్నారు.

రిలేలో 5వ స్థానం..

పురుషుల 4*400 రిలేలో సంచలన రీతిలో తొలిసారి ఫైనల్‌కు అర్హత సాధించిన భారత బృందం.. తుది పోరులో తీవ్రంగా నిరాశపరిచింది. మహ్మద్ అనాస్, అమోజ్, అజ్మల్, రాజేష్ రమేష్‌ల బృందం 2:59.92 సెకన్ల టైమింగ్‌తో ఐదో స్థానంలో నిలిచింది. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లు టాప్-3లో నిలిచి పతకాలు సొంతం చేసుకున్నాయి. కాగా ఈ ప్రంపంచ చాంపియన్‌షిప్‌కు చివరి ఈవెంట్ అయిన మహిళల 4*400 రిలేలో నెదర్లాండ్స్ స్వర్ణం గెలవగా, జమైకా, బ్రిటన్ రతజ కాంస్యాలు సాధించాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *