ఆక్వారైతులకు విద్యుత్‌ రాయితీ

ఆక్వాజోన్‌ పరిధిలో పదెకరాల్లోపు సాగుచేసే సన్న, చిన్నకారు ఆక్వా రైతులకు విద్యుత్‌ సబ్సిడీని వర్తింపజేసేందుకు చేపట్టిన సర్వే ఈ నెలాఖరుతో ముగియనుంది. అర్హతగల వారికి సెప్టెంబర్‌ 1 నుంచి విద్యుత్‌ రాయితీని వర్తింపజేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లుచేస్తోంది. రాష్ట్రంలో 1.40 లక్షల ఎకరాల్లో ఉప్పునీటి, 3.89లక్షల ఎకరాల్లో మంచినీటి ఆక్వా సాగు జరుగుతోంది. వీటికి 63,343 విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఈ?క్రాప్‌ బుకింగ్‌ ప్రకారం 1,35,842 మంది ఆక్వా రైతులుండగా, 2.5 ఎకరాల లోపు 95,277 మంది, 2.5 నుంచి ఐదెకరాల్లోపు 22,358 మంది, 5?10 ఎకరాల్లోపు 11,809 మంది, పదెకరాలకు పైబడి 6,398 మంది ఉన్నారు. కానీ, నాన్‌ ఆక్వాజోన్‌ పరిధిలో సాగుచేస్తున్న వారు సైతం విద్యుత్‌ రాయితీ ద్వారా లబ్ధిపొందుతున్నారు. అలాగే, కొన్నిచోట్ల కనెక్షన్‌ ఒకరి పేరిట ఉంటే, సాగు మరొకరు చేస్తున్నారు. తొలుత జోన్‌ పరిధిలో ఐదెకరాల్లోపు సన్న, చిన్నకారు ఆక్వా రైతులకు మాత్రమే విద్యుత్‌ రాయితీ వర్తింపజేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ తర్వాత ఆ పరిమితిని పదెకరాలకు పెంచింది. అనంతరం ఆక్వాజోన్‌ పరిధిలో వాస్తవంగా సాగుచేసే పదెకరాల్లోపు రైతులను గుర్తించేందుకు విద్యుత్‌, రెవెన్యూ, మత్స్య శాఖలతో సర్వే చేపట్టింది. విద్యుత్‌ కనెక్షన్‌ ఎవరి పేరిట ఉంది? ఆ కనెక్షన్‌ పరిధిలో ఎంత విస్తీర్ణం ఉంది? ప్రతీనెలా ఎంత విద్యుత్‌ వినియోగమవుతోంది? ఆ చెరువుకు లైసెన్సు ఉందా.. లేదా? వంటి వివరాలను ఈ సర్వేలో సేకరించారు.మేలో చేపట్టిన ఈ సర్వే ఇప్పటికే 95 శాతం పూర్తికాగా.. మిగిలింది ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తర్వాత జోన్‌, నాన్‌జోన్‌ పరిధిలో ఎంత విస్తీర్ణం ఉంది? వాటి పరిధిలో ఎన్ని విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి.. జోన్‌ వారీగా ఎంతమంది ఆక్వా రైతులు ఉన్నారో గుర్తించి ఆ జాబితాలను ఆయా డిస్కంలకు పంపిస్తారు. ప్రభుత్వాదేశాల మేరకు జోన్‌ పరిధిలోకి వచ్చే పదెకరాల్లోపు ఆక్వా రైతులకు సెప్టెంబర్‌ 1 నుంచి విద్యుత్‌ రాయితీని వర్తింపజేసేలా ఏర్పాట్లుచేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *