అప్పుడే సీఎం పంచాయితీ షురూ…

హైదరాబాద్‌, డిసెంబర్‌ 2
తెలంగాణ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. పోలింగ్‌ పూర్తయింది. అధిక ఎగ్జిట్‌ పోల్స్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎక్కువ సీట్లు ఇస్తున్నాయి. కానీ కొన్ని హంగ్‌ ను అంచనా వేస్తున్నాయి. అందుకే ఫలితాలు ఎలా వస్తే ఎలా స్పందించాలన్న దానిపై ముందుగానే అన్ని రాజకీయ పార్టీలు ప్లాన్‌ బీ రెడీ చేసుకుంటాయి. అదీ తేడా కొడితే ఏం చేయాలన్నదానిపై ప్లాన్‌ సీ కూడా రెడీ చేసుకుంటాయి. బీఆర్‌ఎస్‌కు ఓ ప్లాన్‌ ఉంది. బీఆర్‌ఎస్‌ వెనుక కావాలనుకుంటే.. బీజేపీ, మజ్లిస్‌ ఉంటాయి. మరి కాంగ్రెస్‌ కు ప్లాన్‌ బీ ఉందా ? సింపుల్‌ మెజార్టీ వస్తే కాంగ్రెస్‌ లో ముఖ్యమంత్రి అభ్యర్థులు సైలెంట్‌ గా ఉంటారా ?. కాంగ్రెస్‌ పార్టీకి మెరుగైన ఫలితాలు వస్తాయన్న నమ్మకం ఏర్పడిరది. కానీ 61 సీట్లు వస్తే కాంగ్రెస్‌ గెలిచినట్లే కానీ ఓడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థులు ఎక్కువ మరి. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి సీఎం అభ్యర్థులం మేమే అనే ప్రకటనలు కనీసం అరడజన్‌ మంది నేతల నుంచి వచ్చాయి. రేవంత్‌ రెడ్డి సీఎం రేసులో ఫ్రంట్‌ రన్నర్‌ గా ఉంటారు. ఆ తర్వాత దళిత కోటాలో మల్లు భట్టి విక్రమార్క్‌ కూడా ఉన్నారు. ఆయన పాదయాత్ర కూడా చేశారు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సోనియా గాంధీ తననే సీఎంను చేస్తారని కాంగ్రెస్‌ లో తన కంటే సీనియర్లు ఎవరూ లేరన్నారు. మరికొంత మంది నేతలు కూడా ఉన్నారు . ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి పదవి కోసం తాను చేయాల్సినదంతా చేస్తారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ చాన్స్‌ రాదని ఆయనకు తెలుసు. భారత రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తమకు ప్లాన్‌ బీ ఉందని ఆయన పరోక్షంగా చెబుతున్నారు. కేసీఆర్‌ మూడో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని ఆయన గట్టిగా చెబుతున్నారు. ఈ నమ్కకం వెనుక ఉన్న కారణం గెలిచే ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ వైపు నుంచి తమ వద్దకు వస్తారన్న నమ్మకమే కావొచ్చని అంచనా వేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ లో కనీసం 40 నుంచి యాభై సీట్లు ఇచ్చారు. అంటే ప్రభుత్వ ఏర్పాటుకు మహా అయితే ఓ పది, పదిహేను స్థానాల లోటు ఏర్పడవచ్చు. తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 119 సీట్లు ఉన్నాయి. సాధారణ మెజార్టీ రావాలంటే 60 అసెంబ్లీ స్థానాలు సాధించాల్సి ఉంటుంది. ఈ విషయంలో భారత రాష్ట్ర సమితికి ప్రత్యేకమైన అడ్వాంటేజ్‌ ఉంది. ఆ పార్టీకి 60 సీట్ల అక్కర్లేదు. 53 సీట్లు సాధిస్తే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుంది. ఎందుకంటే.. మజ్లిస్‌ పార్టీ బీఆర్‌ఎస్‌కు ఏకపక్షంగా మద్దతు పలుకుతుంది. అంటే బయట నుంచి కొంత మంది మద్దతు పొందితే ప్లాన్‌ బీ అమలు చేయవచ్చు. కాంగ్రెస్‌ పార్టీని అధికారం చేపట్టనివ్వకూడదన్నది బీజేపీ లక్ష్యం. అందు కోసం బీఆర్‌ఎస్‌ పార్టీతో కలవడానికి లేదా ఆ పార్టీకి ఏ రకంగా అయినా సహకరించడానికి సిద్ధంగా ఉంటుంది. బీజేపీకి కొన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ పది వరకూ ఇచ్చాయి. కొన్ని నాలుగైదు సీట్లు ఇచ్చాయి. మజ్లిస్‌ కన్నా ఎక్కువ సీట్లు వస్తే బీఆర్‌ఎస్‌ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగితే.. ఆ రెండు పార్టీలు కలిసే చాన్స్‌ ఉంటుంది. బీజేపీ ప్లాన్‌ కూడా అదే అని ఇప్పటికే ఓ క్లారిటీ ఉంది. మజ్లిస్‌, బీజేపీతో కలిసినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని సందర్భంలో బీఆర్‌ఎస్‌ ముందున్న ఒకే ఒక్క దారి కాంగ్రెస్‌ పార్టీని చీల్చడం. ఇప్పటికే రెండు సార్లు సీఎం కేసీఆర్‌ .. కాంగ్రెస్‌ ఎల్పీని బీఆర్‌ఎస్‌ లో విలీనం చేసుకున్నారు. అయితే అప్పట్లో కాంగ్రెస్‌ బలం పరిమితంగా ఉంది కాబట్టి అది సాధ్యమయింది. ఇప్పుడు సాధ్యమవుతుందా అంటే.. కాంగ్రెస్‌ లో రేవంత్‌ రెడ్డి వ్యతిరేకుల్ని చేరదీయడం ద్వారా సాధ్యమవుతుందని అంచనా వేస్తున్నారు. రేవంత్‌ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్‌ బలోపేతం కావడంలో కీలక నేత. ఇప్పుడు మెజార్టీ వస్తే హైకమాండ్‌ కూడా .. ఆయనకే సీఎం పదవి ఇస్తుంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయం వారికి కీలకం. అయితే రేవంత్‌ రెడ్డి కింద మేము పని చేయడం ఏమిటి అన్న భావనలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్లు ఉంటారు. ముఖ్యంగా కోమటిరెడ్డి అదే భావనను చాలా సార్లు వ్యక్తం చేశారు. తానే కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నని.. తనను కాదని ఎవరికీ సీఎం పదవి ఇచ్చే అవకాశం లేదంటున్నారు. అలా కాదంటే.. తనతో ఉన్న ఆరేడుగురు ఎమ్మెల్యేతో ఆయన తన దారి తాను చూసుకోవచ్చు. ఇతర సీనియర్ల పరిస్థితి కూడా అదే కావొచ్చు. అందకే తెలంగాణ ఫలితాల్లో సాధారణ మెజార్టీ వచ్చినా అసలు పరీక్ష కాంగ్రెస్‌ పార్టీకే ఎదురవుతుంది. తెలంగాణ ప్రజలు ఇప్పటి వరకూ అస్పష్టమైన తీర్పు ఇవ్వలేదు. ఈ సారి కూడా అలాగే తీర్పు ఇచ్చినా కాంగ్రెస్‌ లో గెలిచే వారిపైనే సందేహాలు ఉన్నాయి. దీనికి గత చరిత్రే కారణం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *