ఖజానాకు ఆబ్కారీ శాఖే దిక్కు

తెలంగాణ రాష్ట్ర ఖజానాకు ఆబ్కారీ శాఖ పెద్ద దిక్కుగా నిలిచింది. వాణిజ్య పన్నుల శాఖ రికార్డు స్థాయిలో రూ.72 వేల కోట్ల ఆదాయం తెచ్చి పెట్టగా.. ఆబ్కారీ శాఖ రూ.31 వేల 560 కోట్ల రాబడితో సత్తా చాటింది. గతేడాది ఆర్థిక సంవత్సరంలో రూ.36 వేల కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. రికార్డు స్థాయిలో 42.99 కోట్ల లీటర్ల బీరు అమ్ముడుపోయింది. తెలంగాణ మందుబాబులు లిక్కర్‌ కంటే ఎక్కువగా బీర్లనే తాగేసినట్లు ఆబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో జరిగే మొత్తం మద్యం అమ్మకాల్లో 70 శాతం హైదరాబాద్‌, దాని పరిసర జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్‌`మల్కాజిగిరి, నల్గొండ, మెదక్‌ జిల్లాల్లోనే జరుగుతుంది. ప్రధానంగా హైదరాబాద్‌ లో లక్షలాది మంది ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఉండడం, భారీ ఎత్తున స్థిరాస్థి వ్యాపారం జరగడం, అంతర్జాతీయ స్థాయిలో పేరున్న ఫార్మా పరిశ్రమలు ఉండడం, పెద్ద సంఖ్యలో దేశ, విదేశాల నుంచి వివిధ వ్యాపార, పర్యాటక, విద్య, వైద్య అవసరాల కోసం రాకపోకలు సాగించే వారు ఉండడం వల్ల మద్యం అమ్మకాలు భారీగా ఉంటున్నాయని తెలుస్తోంది. దీనికితోడు కొవిడ్‌ నుంచి పూర్తిగా బయట పడడం, వర్క్‌ ప్రం హోం నుంచి ఉద్యోగులు దాదాపు బయటకు వచ్చి పని చేస్తుండడంతో బీరు అమ్మకాలు భారీగా పెరిగాయని అధికారులు అంచనా వేస్తున్నారు.అయితే తెలంగాణలో జరిగిన మొత్తం అమ్మకాల్లో అత్యధికంగ హైదరాబాద్‌ జిల్లాలో రూ.3739.42 కోట్లు, రంగారెడ్డి రూ.8410 కోట్లు, నల్గొండ రూ.3538 కోట్లు, మేడ్చల్‌ రూ.1326 కోట్లు, మెదక్‌ రూ.2917 కోట్లు, ఆదిలాబాద్‌ రూ.1438 కోట్లు, కరీంనగర్‌ రూ.2934 కోట్లు, ఖమ్మం రూ.2222 కోట్లు, మహబూబ్‌ నగర్‌ రూ.2488 కోట్లు, నిజామాబాద్‌ రూ.1652 కోట్లు, వరంగల్‌ రూ.3471 కోట్లు విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వానికి వ్యాట్‌, ఎక్సైజ్‌ డ్యూటీ, మద్యం లైసెన్స్‌ ల ద్వారా ఆదాయం వస్తుంది. ఇప్పటి వరకు జరిగిన రూ.36 వేల కోట్ల విలువైన మద్యం అమ్మకాల లెక్కలను పరిగణలోకి తీసుకుంటే.. రాష్ట్రంలో ప్రతినెలా సగటున రూ.2 వేల 900 కోట్లకు పైగా విలువైన మద్యం అమ్ముడుపోతుంది. ఈ మద్యం విక్రయాల ద్వారా ప్రతి నెల.. రూ.1,150 కోట్ల నుంచి రూ.1,250 కోట్ల వ్యాట్‌.. ప్రతినెలా ఎక్సైజ్‌ డ్యూటీ ద్వారా రూ.1450 కోట్లు వస్తున్నాయి. సర్కారు ఖజానాకు సగటున నెలకు రూ.2,630 కోట్ల ఆదాయం వస్తున్నట్లు అధికారుల అంచనా. అంటే మొత్తం 12 నెలల్లో దాదాపు రూ.31 వేల 560 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇలా రాష్ట్ర సర్కారును పెంచడంలో మందుబాబులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫుల్లుగా తాగుతూ.. సర్కారు ఖజానాకు మస్తు పైసల్‌ వచ్చేలా చేస్తున్నారు. ముఖ్యంగా పండుగలు, పబ్బాలు, చివరకు చావులు, బాధల్లోనైనా తెలంగాణలో మద్యం తాగడం మర్యాద చేయడం ఆనవాయితీగా వస్తోంది. అందుకే ఇంత ఎక్కువ స్థాయిలో ఆదాయం వస్తోందని అంతా అనుకుంటున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *