నేతల్లో పరిశీలకుడి టెన్షన్
వైసీపీలో రానున్న ఎన్నికలలో విజయంపై రోజు రోజుకూ ఖంగారు పెరిగిపోతోంది. భయం గూడు కట్టుకుంటోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి, పార్టీ అధినేత జగన్ లో ఈ భయం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. దీంతో రోజుకో కొత్త నిర్ణయం, పూటకో కొత్త నియామకం చేపడుతున్నారు. తాజాగా ప్రతి నియోజకవర్గానికి ఒక పరిశీలకుడిని నియమించాలని జగన్ నిర్ణయించారు. ఇప్పటికే నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఇన్ చార్జిగా ఉన్నారు.ఇప్పుడు అదనంగా పరిశీలకుడిని నియమించాలని నిర్ణయించారు. ఆ పరిశీలకుల జాబితా ఇప్పటికే ఖరారైందని కూడా పార్టీ వర్గాలుచెబుతున్నాయి. అంటే ఇప్పుడు ఉన్న నియోజకవర్గ ఇన్ చార్జ్ కాకుండా ఒక పరిశీలకుడు కూడా ఉంటారన్న మాట.జగన్ నిర్ణయంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలలో గాభరా పెరిగింది. అయితే ఈ పరిశీలకులు ఏం చేస్తారు, ఏం చేయాలి, వారి బాధ్యతలు ఏమిటి అన్నది మాత్రం ఇతమిథ్థంగా తెలియదు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ ప్రభుత్వ వ్యతిరేకత, నియోజకవర్గ ఎమ్మెల్యేలపై ప్రజలలో అసంతృప్తి తార స్థాయిలో ఉందన్న ఐ ప్యాక్ నివేదిక ఆధారంగా జగన్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.జగన్ ఎన్నో ఆశలు పెట్టుకుని జనాలలోకి పార్టీ కార్యక్రమాలను, ప్రభుత్వ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను, తాను బటన్లు నొక్కడం ద్వారా లబ్ధిదారులు పొందిన ప్రయోజనాలను ప్రజలకు వివరించి మరో సారి వైసీపీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు సోపానంగా మారుతుందని భావించిన గడపగడపకూ కార్యక్రమం దారుణంగా విఫలం అవ్వడమే కాకుండా బూమరాంగ్ అయ్యి ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజలను ఫేస్ చేయలేని పరిస్థితులు ఎదురు కావడంతో ఆయనలో ఖంగారు మొదలైందని పరిశీలకులు అంటున్నారు. ఆ కారణంగానే పని చేసే వారికే పార్టీ టికెట్లు, విపక్ష విమర్శలకు దీటుగా కౌంటర్ ఇవ్వని మంత్రులకు ఉద్వాసన అంటూ తన అసహనాన్ని ప్రదర్శిస్తున్నారని అంటున్నారు.ఇప్పుడు తాజాగా నియోజకవర్గ పరిశీలకులు నియామకానికి సిద్ధం కావడంతో నియోజకర్గాలలో ఇప్పటికే ఉన్న వర్గ విభేదాలతో అయోమయంలో ఉన్న పార్టీ క్యాడర్ మరింత గందరగోళానికి గురి చేసే నిర్ణయంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.ఇప్పుడు నియమితులు కానున్న పరిశీలకులు ఇప్పటికే ఉన్న ఇన్ చార్జీలకు అదనం కావడంతో పరిస్థితి మరింత క్లిష్టం అవుతుందని పార్టీ క్యాడర్ అంటున్నారు. ఇప్పటికే దాదాపు ప్రతి నియోజకర్గంలోనూ గ్రూపు తగాదాలు ఉన్నాయి. పార్టీ టికెట్ ఆశావహుల సంఖ్యా భారీగానే ఉంది. ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చేది లేదంటూ జగన్ ఇప్పటికే ప్రకటించడంతో దాదాపు 151 నియోజకవర్గాలలోనూ ఎమ్మెల్యేలలో అభద్రతా భావం నెలకొని ఉంది. ఆ కారణంగానే దాదాపు అన్ని నియోజకవర్గాలలోనూ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్యా అధికంగానే ఉంది. ఇప్పుడు పరిశీలకుల నియామకం నిర్ణయంతో గ్రూపులు మరిన్ని పెరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలే అంటున్నాయి.దాదాపుగా అన్ని నియోజకవర్గాలలోనూ ఎమ్మెల్యేనే ఇన్ చార్జిగా ఉన్నారు. అయితే ఎమ్మెల్యేలపై ప్రజాగ్రహం ఉందంటూ జగన్ పరిశీలకుల నియామకానికి తెరతీశారు. అసలు వాస్తవంగా ప్రతి నియోజకవర్గానికి అదనపు ఇన్ చార్జిని అంటే ఎమ్మెల్యేకు పోటీగా ఒకరిని నియమించాలన్నది ఆయన ఉద్దేశంగా పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే ఉండవల్లి శ్రీదేవి తన నియోజకవర్గానికి ఇన్ చార్జిగా డొక్కా మాణిక్యవరప్రసాద్ ను నియమించడానికి వ్యతిరేకంగా గళమెత్తడం, ఆమె వర్గీయులు ఆందోళనకు దిగడంతో జగన్ వెనక్కు తగ్గారని అంటున్నారు.అందుకే ఇప్పుడు పరిశీలకుల పేర అదనపు ఇన్ చార్జిలను నియమిస్తున్నారని పార్టీ శ్రేణులే అంటున్నాయి. గతంలోలా తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసే ధైర్యం జగన్ కోల్పోయారనీ, పార్టీలో అసంతృప్తి, తన నిర్ణయాలను ధిక్కరించి ఆందోళనలకు సైతం దిగుతున్న పరిస్థితులను గమనించి భయపడుతున్నారనీ అంటున్నారు. ఏది ఏమైనా పేరు పరిశీలకుడే అయినా ఆ పరిశీలకుడి పాత్ర మాత్రం అదనపు ఇన్ చార్జి అనే పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఎమ్మెల్యేలు సహజంగానే పరిశీలకుడికి సహకరించే పరిస్థితి ఉండదని అంటున్నారు. మొత్తంగా ఈ మూడేళ్లలో ఎన్నడూ లేనంత అయోమయ పరిస్థితుల్లో వైసీపీ పార్టీ, ఆ పార్టీ నేతలు, ఆఖరికి ముఖ్యమంత్రి కూడా ఉన్నారని పరిశీలకులు అంటున్నారు. గతంలో జగన్ కు కోపం వస్తుందేమోనని పార్టీ నాయకులు భయపడేవారని ఇప్పుడు నేతలు అసమ్మతి గళం విప్పుతారేమోనని జగన్ భయపడే పరిస్థతి ఏర్పడిరదని పరిశీలకులు