Gymnast Deepa Karmakar: సాయ్ మౌనం.. బాధాకరం
న్యూఢిల్లీ: ట్రయల్స్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచినా.. తనను ఆసియాడ్ జట్టుకు ఎంపిక చేయకపోవడంపై స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తన విషయంలో కేంద్ర క్రీడా ప్రాథికార సంస్థ (సాయ్) మౌనంగా ఉండడం తీవ్ర నిరుత్సాహానికి గురి చేస్తోందని విమర్శలు గుప్పించింది. భువనేశ్వర్లో ఆసియాడ్ కోసం జరిగిన ట్రయల్స్లో దీప అగ్రస్థానంలో నిలిచినా.. కేంద్ర క్రీడాశాఖ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ప్రదర్శన లేదన్న కారణంతో ఆమెను ఎంపిక చేయలేదు. దీంతో గతంలో తన ప్రదర్శనలను పరిగణనలోకి తీసుకొని జట్టులోకి తీసుకోవాలంటూ దీప క్రీడాశాఖకు విజ్ఞప్తి చేయగా.. ఈ విషయాన్ని పరిశీలించాలంటూ సాయ్కు క్రీడాశాఖ సూచించింది. ఈ సూచనను సాయ్ పరిగణనలోకి తీసుకోకపోవడంతో దీప ఆవేదన వ్యక్తం చేసింది.