పసుపు బోర్డు ఏర్పాటు కానందుకు రైతులు కన్నెర్ర
పసుపు బోర్డుకు పంగనామం పెట్టడంపై భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై నిజామాబద్ రైతులు కన్నెర్రజేశారు. పసుపు బోర్డును ఏర్పాటు చేసే ప్రతిపాదన లేదని కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ పార్లమెంటులో ప్రకటించిన విషయం విధితమే. ఈ ప్రకటనతో రైతుల ఆగ్రహం కట్టలుతెంచుకుంది. పార్లమెంటు వేదికగా మోసం మరోసారి బట్టబయలైందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకు నిరసనగా స్థానిక బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ నిర్వాకాన్ని ఎండగడుతూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ‘‘పసుపు బోర్డు… ఇది మా ఎంపీ గారు తెచ్చిన పసుపు బోర్డు’’ అని పేర్కొని ఉన్న పసుపు రంగు ఫ్లెక్సీలను రైతులు కట్టారు. తమను స్థానిక ఎంపి అర్వింద్ మోసం చేశారని రైతులు ఆరోపించారు.
బోర్డు కోసం గత కొంత కాలంగా నిరసనలు తెలుపుతున్న రైతులు పలుసార్లు అర్వింద్ ను అడ్డుకున్నారు. ఇంకెంత కాలం మోసం చేస్తారని నిలదీశారు. ఇకపై పసుపు బోర్డు కోసం ఆందోళనలను ఉదృతం చేస్తామని, బీజేపీ నేతలు, ముఖ్యంగా అర్వింద్ ను ఎప్పటికప్పుడు దీనిపై నిలదీస్తామని రైతులు తేల్చిచెప్పారు.