టీ కాంగ్రెస్‌ నేతల ఐక్యతా రాగం

రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే రూ. 500లకే పేదలకు వంట గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తామని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ప్రకటించారు. కేజీ టు పీజీ ఉచిత, నాణ్యమైన ఇంగ్లిష్‌ విూడియం విద్య అందిస్తామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగులకు నెలకు రూ. 4 వేల చొప్పున భృతి సహా కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో పెట్టనున్నట్లు చెప్పిన 10 హావిూలను ప్రకటించారు. భట్టి విక్రమార్క పాదయాత్ర 800 కి.విూ. పూర్తయిన సందర్భంగా జడ్చర్లలో రాజీవ్‌ గాంధీ మైదానంలో కాంగ్రెస్‌ పార్టీ ‘పీపుల్స్‌ మార్చ్‌’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించింది. కర్ణాటక ఎన్నికల ప్రభావమో, స్వతహాగా మేల్కొలుపో తెలియదు గానీ.. కాంగ్రెస్‌ నేతలందరూ విభేదాలను పక్కనబెట్టి ఈ సభా వేదికగా ఏకతాటిపైకి వచ్చారు. కేడర్‌కు సానుకూల సంకేతాలను అందించగలిగారు. జిల్లాల వారీగా గెలిపించుకోవాల్సిన స్థానాలపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌ రెడ్డి సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకొని కార్యకర్తల్లో ఉత్సాహం పెంచారు. ప్రజా యుద్ధనౌక గద్దర్‌ పాటలతో హుషారెత్తించారు.అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్‌ పార్టీ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించింది. హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎం సుఖ్వీందర్‌ సింగ్‌ సుక్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్‌ వ్యవహారాల రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి పార్టీ సీనియర్‌ నేతలందరూ హాజరయ్యారు.రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్‌ అప్పుల కుప్పగా మార్చారని దుయ్యబట్టారు. పాదయాత్రలో గిరిజనుల కష్టాలు చూశానని తెలిపిన భట్టి విక్రమార్క.. కాంగ్రెస్‌ పార్టీ పంచిన అటవీ భూములను కేసీఆర్‌ గుంజుకున్నారని ఆరోపించారు. పాదయాత్రలో పోడు భూముల పట్టాలను గిరిజనులు తనకు చూపించారని తెలిపారు. ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. ధరణిలో భూముల వివరాలు కనిపించట్లేదని రైతులు ఆందోళన చెందుతున్నారని భట్టి తెలిపారు.కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు ఇల్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షల చొప్పున ఇస్తామని భట్టి విక్రమార్క ప్రకటించారు. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి, కేసీఆర్‌ మోసం చేశారని.. తాము అధికారంలో రాగానే రూ. 2 లక్షల చొప్పున రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 5 లక్షల వరకు వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12కు 12 స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపిస్తామని ప్రకటించారు. పాలమూరు జిల్లాలో 14కు 12 స్థానాలను గెలిపిస్తారా అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డికి సవాల్‌ విసిరారు. అనంతరం మాట్లాడిన రేవంత్‌ రెడ్డి ఆ సవాల్‌ను స్వీకరించారు. పాలమూరులో 14కు 14 స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తామని తెలిపారు. కార్యకర్తలు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.‘తెలంగాణ రాష్ట్రం వస్తే పాలమూరు జిల్లాను అభివృద్ధి చేస్తామని కేసీఆర్‌ మాట ఇచ్చారు. కానీ, తెలంగాణ వచ్చినా, పాలమూరులో వలసలు ఇంకా ఆగలేదు. నిరుద్యోగులు, రైతుల ఆత్మహత్యలు ఆగలేదు. కేసీఆర్‌ కుటుంబం రాజ్యాలు ఏలితే.. బడుగు బలహీనవర్గాల బిడ్డలు కులవృత్తులు చేసుకోవాలా? గొర్లు, బర్లు మేపడానికి కాదు, తెలంగాణ తెచ్చుకుంది’ అని రేవంత్‌ రెడ్డి అన్నారు. పాలమూరు ` రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎవరు అడ్డుకున్నారని ఆయన ప్రశ్నించారు.‘నల్లమల అడవుల్లో పుట్టిన విూ బిడ్డ పీసీసీ అధ్యక్షుడిగా విూ ముందు నిలబడటానికి సోనియా గాంధీ అవకాశం ఇచ్చారు. నేను విూరు నాటిన మొక్కను. ఇవాళ పీసీసీ అధ్యక్షుడిగా విూ ముందున్నా. ఇది మిడ్జిల్‌ మండల, పాలమూరు ప్రజల గొప్పదనం. విూ బిడ్డకు అవకాశం వచ్చింది. ఇది మన ఆత్మగౌరవ సమస్య. పాలమూరు జిల్లా నుంచి 14కు 14 ఎమ్మెల్యే స్థానాలు, రెండు ఎంపీ స్థానాలు గెలిపించాలి’ అంటూ కాంగ్రెస్‌ కార్యకర్తలకు రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *