ఆప్కో బట్టలకు ఫుల్ డిమాండ్
విజయవాడ, ఆగస్టు 10
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఉద్యోగులు దుస్తులు కొనేందుకు తెగ ఎగబడ్డారు. సచివాలయం మూడో బ్లాక్ లో ఉన్న ఆప్కో ఔట్ లెట్ లో చేనేత వస్త్రాలు కొనడానికి బారులు తీరారు. ఎప్పుడూ ఖాళీగా దర్శనమిచ్చే ఆ స్టాల్ కు ఉద్యోగులు బారులు తీరారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు భారీగా రావడంతో స్టాల్ మొత్తం నిండిపోయింది. సెక్రటేరియట్ లో తమ బాధ్యతల్లో బిజీగా ఉండే ఉద్యోగులు ఎప్పుడూ లేనివిధంగా ఆ స్టాల్ ను ప్రతి రోజూ సగానికిపైగా ఖాళీ చేస్తున్నారు.ఇక్కడ పెట్టిన ఆఫర్ మళ్లీ మళ్లీ రాదనుకున్నారో ఏమో గానీ పండగ సీజన్ కంటే ఎక్కువగా బట్టలు కొనేస్తున్నారు. దీంతో ప్రతి రోజూ కొత్త సరుకును ఆర్డర్ పెట్టి తీసుకొస్తున్నట్లు స్టాల్ నిర్వాహకులు చెప్పారు.స్టాల్ లో ఎప్పుడు చూసినా మహిళా ఉద్యోగులతో నిండిపోతూ ఉండటంతో ఎప్పుడు రావాలనే దానిపై ఫిక్స్డ్ టైం కూడా బోర్డులు పెట్టేసారు స్టాల్ నిర్వాహకులు.అసలింతకీ అక్కడ ఉద్యోగులు ఎగబడటానికి కారణం ఏంటి?అమరావతి సచివాలయం మూడో బ్లాక్ లో ఆప్కో చేనేత దుస్తుల స్టాల్ ను ఏర్పాటు చేశారు అయితే గతంలో ఎప్పుడూ ఇక్కడ పెద్దగా అమ్మకాలు లేవు.అయితే ఆగస్ట్ 7 వ తేదీన జరిగిన చేనేత దినోత్సవం రోజు బంపర్ ఆఫర్లను ప్రకటించారు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సునీత.సెక్రటేరియట్ కో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చేనేత దుస్తులను ధరించడం ద్వారా నేతన్నలను ఆదుకోవాలని సూచించారు.ప్రతి శుక్రవారం చేనేత దుస్తులు ధరించాలని పిలుపునిచ్చారు మామూలుగా పిలుపునిస్తే ఎవరూ పెద్దగా స్పందించరు అనుకున్నారేమో ఆఫర్లను ప్రకటించేశారు సెక్రటేరియట్ ఉద్యోగులకు 50 శాతం రాయితీతో ఆప్కో స్టాల్ లో వస్త్రాలు కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించారు.స్టాల్ లో లభించే నేత చీరలు,మగవారికి కావాల్సిన ప్యాంటు షార్టులపై ఈ ఆఫర్ వర్తిస్తుందని ప్రకటించారు.ఆగస్ట్ 31 వరకూ ఈ ఆఫర్ ఉంటుందని ప్రకటించారు.దీంతో ఆప్కో స్టాల్ కు ఉద్యోగులు ఎగబడుతున్నారు.భోజనం విరమంలో కూడా ఉద్యోగుల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఫలానా టైం లో మాత్రమే డిస్కౌంట్ వర్తిస్తుందని బోర్డులు కూడా పెట్టారు.గతంలో రోజుకు సగటున 20 వేలు ఉండే కౌంటర్ ఒక్కసారిగా లక్షా 50 వేలకు పెరిగిందని ఆప్కో నిర్వాహకులు చెబుతున్నారు.బయట మార్కెట్ లో కంటే సగం రేటుకు వస్తుండటంతో పండగలకు ముందస్తు కొనుగోళ్లు చేస్తున్నామని ఉద్యోగులు చెబుతున్నారు.మరోవైపు ఉద్యోగులు ఒకేసారి బిల్లు చెల్లించే అవసరం లేకుండా రెండు మూడు వాయిదాల్లో చెల్లించేలా కూడా ఆఫర్ పెట్టారు.