కృష్ణానదిపై ఐకానిక్‌ బ్రిడ్జి

హైదరాబాద్‌, జూలై 8, (న్యూస్‌ పల్స్‌ః)
ఎప్పటి నుంచో వేచి చూస్తున్న నిర్మాణానికి తాజాగా కేంద్ర సర్కారు ఆమోదించింది. ఇరు తెలుగు రాష్ట్రాలను కలిపి నిర్మించాలనుకున్న వంతెన నిర్మాణానికి కేంద్రం అనుమతించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య సోమశిల వద్ద కృష్ణా నదిపై తీగల వంతెన (ఐకానిక్‌ హైబ్రిడ్‌ కేబుల్‌ బ్రిడ్జి ) నిర్మాణానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. జాతీయ రహదారుల సంస్థ రూపొందించిన డిటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌` డీపీఆర్‌ ను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తాజాగా ఆమోదం తెలిపింది.ఐకానిక్‌ కేబుల్‌ బ్రిడ్జి నిర్మాణంతో పాటు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు రూ.1,519.47 కోట్లు ఖర్చు చేయాలని కేంద్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. బ్రిడ్జి నిర్మాణానికి రూ.1,082.56 కోట్లు, పర్యాటక అభివృద్ధి పనులకు మరో రూ.436.91 కోట్లు కేటాయిస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర పరిధిలోని కల్వకుర్తి నుంచి సోమశిల వరకు మొత్తంగా 79.3 కిలో విూటర్ల మేర రెండు వరుసల రహదారి నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.886.69 కోట్లు కేటాయించింది. దీనిపై కాంట్రాక్టర్లతో రోడ్లు భవనాల శాఖ ఇప్పటికే ఒప్పందం చేసుకుంది. ఈ ఐకానిక్‌ హైబ్రిడ్‌ కేబుల్‌ బ్రిడ్జి పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయని సంబంధిత అధికారులు తెలిపారు.కృష్ణా నదిపై తెలంగాణలోని సోమశిల, ఆంధ్రప్రదేశ్‌ లోని సిద్ధేశ్వరం గుట్టల మధ్య 1.08 కిలో విూటర్ల మేరకు ఈ ఐకానిక్‌ హైబ్రిడ్‌ కేబుల్‌ బ్రిడ్జి నిర్మించనున్నారు. దేశంలో ఇప్పటికే ఉన్న తీగల వంతెనల కన్నా మెరుగ్గా ఈ కేబుల్‌ బ్రిడ్జీని నిర్మించేందుకు పలు నమూనాలను కేంద్రం పరిశీలించింది. అందులో నుంచి ఒకదాన్ని ఎంచుకుని ఆ తరహాలో బ్రిడ్జి నిర్మాణానికి ఆమోదం ఇచ్చింది. ఈ మార్గానికి ఇప్పటికే జాతీయ రహదారి నంబర్‌ కేటాయించింది కూడా. పనుల పర్యవేక్షణకు ప్రత్యేక విభాగం కూడా ఏర్పాటు చేసింది కేంద్ర సర్కారు. వంతెన నిర్మాణ పనులను జాతీయ రహదారుల సంస్థ చూసుకుంటుంది. టెండర్లు ఆహ్వానించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా కేంద్ర మంత్రిత్వ శాఖ అధికారులకు సంస్థ ఆదేశాలు పంపినట్లు తెలుస్తోంది. వంతెన నిర్మాణంతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలకు మరింత సులువైన మార్గం ఏర్పడటంతో పాటు తెలంగాణ నుంచి తిరుపతికి కనీసం 70`80 కిలో విూటర్ల మేర దూరం తగ్గే అవకాశం ఉంది. చుట్టూ విశాలమైన శ్రీశైలం జలాశయం, నల్లమస అడవి, ఎత్తైన పర్వతాల మధ్య నిర్మించే ఈ వంతెన పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుందని తెలిపారు. తెలంగాణ వైపున లలితాసోమేశ్వర ఆలయం, ఆంధ్రప్రదేశ్‌ వైపున సంగమేశ్వర ఆలయాన్ని చూడటానికి ఇదో కేంద్రంగా మారుతుందని అన్నారు. కృష్ణానదిపై నిర్మించే వంతెనపై పాదచారులు నడిచేందుకు పొడవైన గ్లాస్‌ వాక్‌వే కూడా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. గ్లాస్‌ వాక్‌ వేతో నిర్మితం కానుండటంతో పర్యాటకంగా ఈ మార్గం టూరిస్ట్‌ డెస్టినేషన్‌ అవుతుందని అధికారులు అంటున్నారు. ఇంతటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు పనులు అతి త్వరలోనే ప్రారంభం అవుతాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *