సెటిలర్ల ఓటు
తెలంగాణలో ఎన్నికల సందడి నెలకొంది. ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది. అన్ని రాజకీయ పక్షాలు అస్త్ర శాస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహాల్లో తలమునకలై ఉన్నాయి. సమర్థులను బరిలో దించేందుకు కసరత్తు చేస్తున్నాయి. బలమైన అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నాయి. ఇప్పటికే అధికార బి ఆర్ ఎస్ తొలి విడత జాబితాను ప్రకటించింది. అటు కాంగ్రెస్ తో పాటు బిజెపి సైతం టిక్కెట్లు ఖరారు చేసే పనిలో పడ్డాయి.తెలంగాణ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. అన్ని పార్టీలు గెలుపు పై ధీమా కనబరుస్తున్నాయి. బిగ్ ఫైట్ నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు సెటిలర్స్ ఓట్లు కీలకంగా మారాయి. హైదరాబాద్ నగరం తో పాటు ఏపీ సరిహద్దు నియోజకవర్గాల్లో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ సెటిలర్స్ ఓట్లు ఎటు వెళ్తాయో వారిదే గెలుపు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పోటీకి సిద్ధమవుతోంది. జనసేన సైతం 32 నియోజకవర్గాల్లో బరిలో దిగుతున్నట్లు ప్రకటించింది. దీంతో ఇప్పుడు వైసీపీ పాత్ర ఏమిటి అన్నది తెలియాల్సి ఉంది.వైసిపి కోసం బిజెపితో పాటు బీఆర్ఎస్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. సెటిలర్స్ తోపాటు రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు వైసీపీ మద్దతుదారులుగా ఉన్నారు. వారిని తమ వైపు తిప్పుకోవడం ద్వారా అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలన్నది రాజకీయ ప్రక్షాళన ప్లాన్. అయితే జగన్ ఎవరికి మద్దతు ఇస్తారు అన్నది ప్రశ్నార్ధకంగా మిగిలింది. అటు కెసిఆర్ తో పాటు.. ఇటు బిజెపి అగ్రనేతలతో జగన్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో ఎవరికివారుగా జగన్ తమకే మద్దతు తెలుపుతారన్న ధీమాతో ఉన్నారు. ఏపీ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఎవరికి మద్దతు తెలపాలో తెలియక జగన్ సతమతమవుతున్నట్లు తెలుస్తోంది.2014, 2019 ఎన్నికల్లో ఏపీలో వైసిపి అధికారంలోకి రావాలని కెసిఆర్ ఆకాంక్షించారు. 2014లో అది వీలుపడలేదు. అందుకే 2019లో వైసీపీకి కెసిఆర్ బాహటంగానే సహాయం చేశారు. ఎప్పటి వరకు తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. ఎక్కడా వైరం పెట్టుకున్న సందర్భాలు లేవు. అదే సమయంలో బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వైసీపీ అన్ని విధాలా సహాయం చేస్తూ వస్తోంది. అటు కేంద్ర పెద్దల ప్రోత్సాహం జగన్కు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏపీలో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా బిజెపి మద్దతు కోరితే.. జగన్ అందించాల్సిన అనివార్య పరిస్థితి ఉంది. అదే జరిగితే గత ఎన్నికల్లో సహకరించిన కెసిఆర్ విషయంలో జగన్ ఎలా డీల్ చేస్తారన్నది తెలియాలి.