ఈడీ అదుపులో ఎంపీ సంజయ్‌ రౌత్‌

శివసేన సీనియర్‌ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్‌ రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. పత్రాచల్‌ భూకుంభకోణంలో నగదు అక్రమ చలామణి కేసుకు సంబంధించి ముంబయిలోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు లోతైన విచారణ కోసం రౌత్‌ను అదుపులోకి తీసుకున్నట్లు అంతకుముందు ప్రకటించారు. పత్రాచల్‌ పునరాభివృద్ధిలో భారీ అక్రమాలు జరిగాయంటూ సంజయ్‌ రౌత్‌ భార్య, అతని సన్నిహితులపై ఆరోపణలున్నాయి. ఇదే కేసులో సంజయ్‌ రౌత్‌ జులై 1న ఈడీ అధికారుల ఎదుట హాజరై వాంగ్మూలం ఇచ్చారు. ఆ తర్వాత రెండు సార్లు సమన్లు జారీ అయినా పార్లమెంటు సమావేశాలు ఉన్నాయంటూ గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 7 గంటలకు ఈడీ అధికారులు సంజయ్‌ రౌత్‌ నివాసానికి చేరుకున్నారు. 9 గంటలపాటు విచారించిన తర్వాత ఆయనను ముంబయిలోని ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. రూ.1,034 కోట్ల పత్రాచాల్‌ భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసు విచారణకు సంబంధించి ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నించారు. అర్ధరాత్రి దాటాక రౌత్‌ అరెస్టు విషయాన్ని ప్రకటించారు.ఈడీ అధికారుల సోదాలపై శివసేన నేత సంజయ్‌ రౌత్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారుల సోదాలపై సంజయ్‌ రౌత్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. తాను ఎలాంటి తప్పు చేయలదేన్నారు. ‘‘ఎట్టి పరిస్థితుల్లో శివసేనను వీడేది లేదు. చనిపోయినా సరే.. నేనెవరికీ తలొగ్గబోను. నాకు ఎలాంటి కుంభకోణంతో సంబంధం లేదు. బాలాసాహెబ్‌ ఠాక్రేపై ప్రమాణం చేసి ఈ విషయం చెబుతున్నాను. బాలాసాహెబ్‌ మాకు ఎలా పోరాడాలో నేర్పారు. శివసేన కోసం పోరాటం కొనసాగిస్తూనే ఉంటా’’ అని ట్వీట్‌ చేశారు. శివసేనను అంతమొందించే కుట్రలో భాగంగానే ఈడీ సోదాలు జరుగుతున్నాయని ఆ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే ఆరోపించారు. ఈడీ భయంతోనే శివసేన ఎమ్మెల్యేలు పలువురు తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండే వర్గంలో చేరారని విమర్శించారు. సంజయ్‌ రౌత్‌ నిరపరాధి అయితే ఈడీ అధికారుల చర్యలకు భయపడాల్సిన అవసరం లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే అన్నారు.ఏప్రిల్‌లో, ఈ దర్యాప్తులో భాగంగా రౌత్‌ భార్య వర్షా రౌత్‌, అతని ఇద్దరు సహచరులకు చెందిన రూ.11.15 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ తాత్కాలికంగా అటాచ్‌ చేసింది. అటాచ్‌ చేసిన ఆస్తులు పాల్ఘర్‌, సఫాలే (పాల్ఘర్‌లోని పట్టణం), పద్ఘా (థానే జిల్లాలో) వద్ద సంజయ్‌ రౌత్‌ సహాయకుడు, గురు ఆశిష్‌ కన్‌స్ట్రక్షన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మాజీ డైరెక్టర్‌ అయిన ప్రవీణ్‌ ఎం రౌత్‌ ఆధీనంలో ఉన్న భూమి రూపంలో ఉన్నాయి. ముంబయి శివారులోని దాదర్‌లోని వర్షా రౌత్‌కు చెందిన ఫ్లాట్‌తోపాటు అలీబాగ్‌లోని కిహిమ్‌ బీచ్‌లో వర్షా రౌత్‌, సుజిత్‌ పాట్కర్‌ భార్య స్వప్నా పాట్కర్‌ సంయుక్తంగా కలిగి ఉన్న ఎనిమిది ప్లాట్లు కూడా అటాచ్‌ చేసిన ఆస్తుల్లో ఉన్నాయని ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. రూ.1,034 కోట్ల పత్రాచాల్‌ భూకుంభకోణం కేసుకు సంబంధించి ఇప్పటికే రౌత్‌ సన్నిహితుడు ప్రవీణ్‌ రౌత్‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయన జుడిషియల్‌ కస్టడీలో ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *