అక్రమ మైనింగ్‌ అడ్డుకున్న లేడీ వీఆర్వో…

కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం కొత్తూరులో మహిళా వీఆర్వో విూనా సాహసం చేశారు. చేతిలో తన బిడ్డను ఎత్తుకుని, అదే సమయంలో విధి నిర్వహణలో భాగంగా అక్రమంగా జరుగుతున్న మైనింగ్‌ ను అడ్డుకున్నారు. ఈ ఘటన స్దానికంగా సంచలనం రేకెత్తించింది.పిల్లవాడిని ఎత్తుకుని అక్రమ మైనింగ్‌ మాఫియా అడ్డుకున్న మహిళా వీఆర్వో విూనా వ్యవహరం హాట్‌ టాపిక్‌ గా మారింది. పసుమర్రులో అక్రమ మైనింగ్‌ జరుగుతుందని స్థానికంగా ఉన్న పలువురు వీఆర్వోకు సమాచారం అందించారు. దీంతో లారీలు తరలి వళ్ళే పరిదిలో మరో చోట విధులు నిర్వర్తిస్తున్న వీఆర్వో విూనా మాత్రం చాలా సీరియస్‌ గా రియాక్ట్‌ అయ్యారు. తనకు సమాచారం అందించిన వెంటనే చేతిలో చంటి బిడ్డ ఉన్నప్పటికీ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తన పరిధిలోని కొత్తూరులో రెండు వాహనాలను సీజ్‌ చేశారు. మహిళ అయి ఉండి, తన చేతిలో పసిబిడ్డ ఉన్నప్పటికీ ఉదయాన్నే తనకు ఫోన్‌ కాల్‌ రావడంతో ఆమె హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్నారు. చంటి బిడ్డతో వెళ్ళి ఆమె లారీని అడ్డుకున్న తీరును చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.పామర్రు మండలంలోని, రిమ్మనపూడి, పోలవరం, మలయప్ప పేట చెరువులను తవ్వి ఇష్టాను సారంగా మట్టిని తరలిస్తున్నారు. ఇందులో కొందరు అధికారులతో పాటుగా అధికార పార్టీ వైసీపీకి చెందిన నాయకుల ప్రమేయం ఉందనే ఆరోపణలు స్థానికంగా వ్యక్తం అవుతున్నాయి. దీనిపై స్థానికులు గతంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. అయితే ఇప్పుడు మహిళా వీఆర్వో, తన చంటిబిడ్డతో లారీకి అడ్డుగా వెళ్ళి మరి మట్టి తవ్వకాలను అడ్డుకోవటంతో ఆమె ధైర్యం, విధి నిర్వహణలో ఆమె సాహసంపై స్థానికంగా చర్చించుకుంటున్నారు. ఎమ్మార్వోకు సమాచారం ఇచ్చినప్పటికి స్థానికంగా ఉన్న అధికారులకు సమాచారం ఇవ్వటంతో ఎవరికి వారు సైడయిపోవటం, ఆ తరువాత మరుసటి రోజు యథావిధిగా మట్టి తవ్వకాలు చేయటం పరిపాటిగా మారిందని స్దానికులు అంటున్నారు.వేసవికాలం వచ్చిందంటే చాలు మట్టి మాఫియా ఇష్టానుసారంగా తవ్వకాలు చేయటం పరిపాటిగా మారింది. చేపల చెరువుల కోసం, ప్రైవేట్‌ స్దలాలు మెరక కోసం భారీ ఎత్తున మట్టి అవసం అవుతుందని, అయితే ఇలాంటి అవసరాలను క్యాష్‌ చేసుకునేందుకు స్దానికంగా ఉన్న నాయకులు ఇలాంటి చర్యలకు పాల్పడటం కామన్‌ అయిపోయిందని స్దానికులు అంటున్నారు. వేసవి కాలంలో చెరువుల ఇతర కాలువలు ఎండిపోవటంతో అందులో మట్టిని ఇష్టానుసారంగా తవ్వకాలు చేయటం అవసరం అయిన వారికి అదిక ధరలకు విక్రయించి లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయని స్థానికులు అంటున్నారు. ఇందులో రెవెన్యూ అధికారుల పాత్రతో పాటుగా, పంచాయతీ, నీటి పారుదల శాఖకు చెందిన అధికారుల హస్తం ఉందని అంటున్నారు.వాస్తవానికి వేసవి కాలంలో చెరువుల్లో పూడిక తీత పనులు చేపట్టి మత్స్య సంపదను పరిరక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మత్స్య శాఖ అదికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో పాటుగా స్దానికంగా ఉన్న పొలిటికల్‌ ప్రెషర్‌ తో మట్టిని తవ్వుకుపోతున్నా పట్టించుకోవటం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో మహిళా వీఆర్వో తన చేతిలో పసిపిల్లాడిని ఎత్తుకొని మరి అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకోవటం సంచలనంగా మారింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *