మళ్లీ తెరపైకి ఓట్ల పంచాయితీ

అనంతపురం, అక్టోబరు 19
అధికార వైసీపీ`టీడీపీ ల మధ్య ఓట్ల పంచాయితీ షురూ అయ్యింది. రాష్ట్రంలో వెలుగుచూస్తున్న దొంగ ఓట్ల వ్యవహారంపై ఎన్నికల సంఘానికి పోటాపోటీగా ఫిర్యాదు చేసుకున్నారు. ఓట్ల తొలగింపుపై నాలుగు నెలల క్రితం నుంచే తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలు ఎవరికి వారే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలుస్తున్నారు. ఆయా పార్టీల తరపున పలు ఫిర్యాదులు చేస్తున్నారు.
కొన్నాళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్షాల నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌ కుమార్‌ విూనాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పక్కాగా చర్యలు తీసుకునేలా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తున్నారు విూనా. గతంలో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఆదేశాలతో డోర్‌ టూ డోర్‌ వెరిఫికేషన్‌ అత్యంత పకడ్బందీగా చేస్తున్నారు. ఓట్ల తొలగింపుపై ఎక్కడెక్కడ ఫిర్యాదులు వస్తున్నాయో అలాంటి నియోజకవర్గాల్లో ఒకటికి రెండుసార్లు వెరిపికేషన్‌ చేసేలా ఆదేశాలు జారీ చేశారు. ఇదిలావుంటే ఏపీలో అక్టోబర్‌ 27 న డ్రాఫ్ట్‌ జాబితా విడుదల తర్వాత నకిలీ ఓట్ల అంశం మరింత ముదిరే అవకాశం ఉంది.ప్రస్తుతం రాష్ట్రంలో ఓటర్ల జాబితా రీవెరిఫికేషన్‌ ప్రక్రియ కొనసాగుతుంది. అక్టోబర్‌ 27న డ్రాఫ్ట్‌ ఓటర్‌ లిస్ట్‌ ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌ కుమార్‌ విూనా ప్రకటించారు. దీంతో గత వారం రోజులుగా నకిలీ ఓట్ల అంశంపై మరోసారి ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువస్తున్నారు రెండు పార్టీల నేతలు. గతంలో ఇదే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి అధికార విపక్షాల నేతలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఆ తర్వాత ఓట్ల తొలగింపునకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది రాష్ట్ర ఎన్నికల సంఘం.
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపునకు సంబంధించి అధారాలు బయటపడటంతో పెద్ద ఎత్తున దుమారమే రేగింది. ఈ నేపథ్యంలో ఇద్దరు అధికారులను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల సంఘం. ఇలా ఎప్పటికప్పుడు తమకు అందిన ఫిర్యాదులపై ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా రెండు పార్టీల నేతలు రెండు రోజుల వ్యవధిలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసి వేరువేరు ఫిర్యాదులు ఇచ్చారు.. వాలంటీర్లు ఫారం `6,పారం`7 లను ఇష్టానుసారం వాడుతున్నారని సీఈవోకు దృష్టికి తీసుకువచ్చారు. ఒక్కో బీఎల్‌వో నిబంధనలకు విరుద్దంగా పది నుంచి 1000 వరకూ ఫారం ? 7లను దరఖాస్తు చేస్తున్నారని.. వీరి స్థానంలో దొంగ ఓట్లు సృష్టిస్తున్నారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఫారం ? 7 ల ద్వారా ఓట్ల తొలగింపుకు సంబంధించిన పలు ఆధారాలను కూడా ఈసీకి సమర్పించారు టీడీపీ నేతలు. నిబంధనలకు విరుద్దంగా ఫారం ? 7 లను దరఖాస్తు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.మరోవైపు అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సైతం నకిలీ ఓట్లపై చర్యలు తీసుకోవాలంటూ సీఈవో ను కలిసింది. మంత్రులు వేణుగోపాల్‌, దాడిశెట్టి రాజాతో పాటు మాజీ మంత్రి కురసాల కన్నబాబు సీఈవోను కలిసి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు హయాంలో 60 లక్షల దొంగ ఓట్లను చేర్పించారని ఆరోపించారు. నకిలీ ఓట్లను తనిఖీ చేసి తొలగించాలని ఫిర్యాదు చేశారు. ఒకే వ్యక్తికి రెండు మూడు చోట్ల ఓట్లను నమోదు చేసుకున్న విషయాన్ని ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు వైసీపీ నేతలు తెలిపారు. ఆనర్హుల ఓట్లన్నీ తొలగించాలని కోరినట్లు చెప్పారు. రెండు రాష్ట్రాల్లో ఓట్లు ఉండటం, రెండు, మూడు ఓట్లు ఉండటం సమంజసం కాదంటున్నారు వైసీపీ నేతలు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *