ఏపీలో అన్నా వర్సెస్‌ చెల్లి..?

‘నేను జగనన్న వదిలిన బాణాన్ని. జగనన్నకు ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి. వైసీపీకి ఓటెయ్యండి’ ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో అందరికీ అర్థమయ్యే ఉంటుంది కదూ. ఇంకెవరు వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల. ఒకప్పుడు అన్న వైఎస్‌ జగన్‌కు కొండంత అండగా నిలిచారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావం నుంచి అధికారంలోకి తీసుకువచ్చే వరకు అన్నకు తోడుగా నిలిచారు. అన్న జైల్లో ఉన్నప్పుడు మరో ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర సైతం చేశారు. 2014, 2019 ఎన్నికల ప్రచారంలో స్టార్‌ కాంపైనర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇదంతా గతం. కానీ ఇప్పుడు సీన్‌ మారింది. ఒకప్పుడు రక్తం పంచుకుపుట్టిన చెల్లిగా అన్నకు తోడుగా ఎన్నికల ప్రచారం చేసిన వైఎస్‌ షర్మిల మళ్లీ ఏపీకి వస్తారని ప్రచారం జరుగుతుంది. తెలంగాణలో పార్టీ పెట్టిన ఆమె తెలంగాణకు పరిమితం కాకుండా ఏపీకి ఎందుకు వస్తున్నారు. వైఎస్‌ఆర్‌ టీపీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేస్తారని తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీని రాష్ట్రంలో యాక్టివ్‌ చేసేందుకు ఆమె ఏపీలో అడుగు పెట్టబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఇదే నిజమైతే వచ్చే ఎన్నికలు అన్నా వర్సెస్‌ చెల్లెలుగా మరే అవకాశం లేకపోలేదు.2019 ఎన్నికల అనంతరం వైఎస్‌ షర్మిల తెలంగాణకే పరిమితమయ్యారు. ఏపీ సీఎం, సోదరుడు వైఎస్‌ జగన్‌తో వైఎస్‌ షర్మిలకు పదవులు, ఆస్తుల పంపకాల విషయంలో విభేదాలు తలెత్తినట్లు ప్రచారం జరిగింది. ఈ పరిణామాలతో వైఎస్‌ షర్మిల వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీని స్థాపించడంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా అనేక ధర్నాలు, నిరసనలు చేశారు. అంతేకాదు పోరాటాలు సైతం చేశారు. పాదయాత్ర సైతం చేపట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణ కోడలిని అంటూనే బీఆర్‌ఎస్‌, బీజేపీలపై తీవ్రస్థాయిలో షర్మిల ధ్వజమెత్తుతున్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో వైఎస్‌ఆర్టీపీకి ఆదరణ అంతగా ఉండదని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అంతేకాదు తెలంగాణ రాజకీయ పార్టీలు సైతం వైఎస్‌ షర్మిలను స్థానికేతరురాలిగా విమర్శలు చేస్తున్నారు. ఇలా అయితే తెలంగాణలో నెగ్గుకు రావడం కష్టమని వైఎస్‌ షర్మిల భావించినట్లున్నారు. అదే తరుణంలో కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయ దుందుభి మోగించింది. దీంతో ఆమె దృష్టి కాంగ్రెస్‌ వైపు మళ్లింది. తెలంగాణలో అగమ్యగోచరంగా తిరుగుతున్న బాణాన్ని ఇప్పుడు ఏపీవైపు ఎక్కుపెట్టింది అని ప్రచారం జరుగుతుంది.ఇంతకీ ఏపీవైపు వైఎస్‌ షర్మిల ఎందుకు వస్తుందనే సందేహం కలిగే ఉండొచ్చు. వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేసేందుకు షర్మిల సిద్ధమయ్యారనే ప్రచారం జరుగుతుంది. వైఎస్‌ఆర్టీపీని కాంగ్రెస్‌లో విలీనం అనంతరం ఆమె ఏపీ కాంగ్రెస్‌కు సారథ్యం వహిస్తారనే ప్రచారం జరుగుతుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఇప్పటికే ధృవీకరించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో జూలై 6న ఇడుపులపాయకు సోనియా గాంధీ లేదా రాహుల్‌ గాంధీతో కలిసి వైఎస్‌ షర్మిల రాబోతున్నట్లు సమాచారం. అక్కడ వైఎస్‌ షర్మిలతో కలిసి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత అక్కడ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్వర్యంలో బహిరంగసభ లేదా కాంగ్రెస్‌ నేతలతో సమావేశం జరుగుతుందని వార్తలు హల్‌ చల్‌ చేస్తున్నాయి. బహిరంగ సభ లేదా కాంగ్రెస్‌ నేతల సమావేశంలో వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీని షర్మిల విలీనం చేస్తున్నట్లు ప్రకటిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే సమావేశంలో షర్మిలకు కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలో చేర్చుకుంటారని ప్రచారం జరుగుతుంది. అనంతరం ఏపీ కాంగ్రెస్‌ పగ్గాలు వైఎస్‌ షర్మిలకు అప్పగించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.రాహుల్‌ గాంధీని ప్రధానిమంత్రిని చేయడమే వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి లక్ష్యం. వైఎస్‌ఆర్‌ మరణించే వరకు రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయడమే తమ లక్ష్యమని పలు వేదికలపై ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తండ్రి కోరికను నెరవేర్చడమే తన లక్ష్యమని వైఎస్‌ షర్మిల భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వైఎస్‌ షర్మిల ఏపీ కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలిగా రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్‌ షర్మిల క్రియాశీకలంగా వ్యవహరిస్తే ఎవరికి లాభం అనేది ఆసక్తికరంగా మారింది. వైఎస్‌ షర్మిల నిజంగానే కాంగ్రెస్‌లో చేరితే వైసీపీని, ప్రభుత్వాన్ని, వైసీపీ పాలనలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను షర్మిల నిలదీయాల్సి ఉంటుంది. అధికార పార్టీని విమర్శించకుండా రాజకీయం చేయడం అసాథ్యం. అలాగని షర్మిల వైసీపీపై విమర్శలు చేస్తే ఆ పార్టీ విశ్వసనీయతకు ఇబ్బందే. అంతేకాదు షర్మిలపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఎదురుదాడికి దిగితే అది రాజకీయ యుద్ధం. కానీ అంతటికి సాహసిస్తారా అన్న చర్చ మొదలైంది. కాబట్టి జగనన్న బాణం గురి తప్పి తిరిగి వచ్చి ఆయనకే గుచ్చుకొంటే రాజకీయాలలో పరాభవం తప్పదనే ప్రచారం కూడా లేకపోలేదుమరోవైపు వైఎస్‌ షర్మిల ఎంట్రీతో ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేనలకు ఇబ్బంది అనే ప్రచారం కూడా ఉంది. వైసీపీ వ్యతిరేక ఓటును క్యాష్‌ చేసుకోవాలని ఆ పార్టీలు భావిస్తున్నాయి. అయితే వైఎస్‌ షర్మిల రంగంలోకి దిగితే ఆ ఓట్లు కాస్త ఆమె వైపునకు పడతాయని ఫలితంగా అది ప్రతిపక్షాలకు నష్టం చేకూర్చడంతోపాటు వైసీపీకి మరింత లబ్ధి చేకూర్చినట్లు అవుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *