అమాత్యుల అత్యుత్సాహం వెనుక…
తిరుమల, ఆగస్టు 19, (న్యూస్ పల్స్)
అఖిలాండకోటి బ్రహ్మండ నాయకుడైన శ్రీవారి దర్శనానికి రోజూ వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తారు. స్వామివారిని దర్శించుకోవడానికి టీటీడీ వివిధ రూపాల్లో వెసులుబాటు కల్పించింది. అందులో మొదటిది సర్వదర్శనం. దీనికి ఎలాంటి సిఫారసు అక్కర్లేదు. గంటల తరబడి క్యూ లైనులో వేచి ఉండాల్సి వచ్చినా సామాన్య భక్తులు అత్యధిక సంఖ్యలో ఈ విధానంలోనే దర్శనానికి వస్తారు. ఇక రెండోది 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం. రోజూ 25 వేల టికెట్స్ను ఆన్లైన్ విధానంలో వీటిని అందుబాటులో ఉంచుతారు. మూడోది సిఫారసు లేఖలపై పఎఖ దర్శనం. ఇవి కాకూండా వృద్దులు, వికలాంగులు, చంటి బిడ్డల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం ఉంటుంది. ఎలాంటి సిఫారసు లేఖలు లేకూండా ప్రొటోకాల్ దర్శనం కల్పించే శ్రీవాణి ట్రస్ట్ దర్శనాలు ఉన్నాయి. ఇదంతా బాగానే ఉన్నా.. సిఫారసు లేఖల దర్శనాలను ప్రజాప్రతినిధులు వినియోగిస్తున్న తీరు టీటీడీ ప్రతిష్టను దెబ్బతీస్తోంది. ఇటీవల కాలంలో కొండపై కొందరు మంత్రుల ఓవర్ యాక్షన్ తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖపై ఆరుగురికి వీఐపీ దర్శనం కల్పిస్తారు. మంత్రి స్వయంగా వస్తే 10 మంది వరకు అనుమతి ఇస్తారు. కానీ.. ఈ నిబంధన పాటించడం లేదు కొందరు అమాత్యులు. రద్దీ రోజుల్లో భక్తులు క్యూ లైన్లో గంటల తరబడి వేచి చూస్తున్నా.. మంత్రులు పట్టించుకోవడం లేదు. తమతో వచ్చే అనుచరులు అందరికీ వీఐపీ దర్శనం కోసం నానా రచ్చ చేస్తున్నారు. తాజాగా మంత్రి ఉషాశ్రీ చరణ్ అనుచర గణం చేసింది అదే.గతంలో మంత్రులు గుమ్మనూరు జయరాం.. వేణుగోపాల కృష్ణ, సీదిరి అప్పలరాజు తదితరులు ఇదే విధంగా పెద్ద సంఖ్యలో అనుచరులను దర్శనానికి తీసుకొచ్చారు. ఒకేసారి 60 నుంచి 80 మందిని తమతోపాటు ఆలయంలోకి తీసుకెళ్లే వరకు ఊరుకోలేదు. మంత్రి అప్పలరాజు అయితే ఏకంగా 150 మందితో వచ్చి ఆలయం దగ్గర చేసిన యాగి అంతా ఇంతా కాదు. వచ్చిన వాళ్లు అమాత్యులు కావడంతో.. టీటీడీ అధికారులు కూడా కాదన లేకపోతున్నారు. నిబంధనలకు నీళ్లొదిలేస్తున్న పరిస్థితి. కళ్లేదుటే సామాన్య భక్తులు ఇబ్బంది పడుతున్నా మంత్రులకు చీమ కుట్టినట్టు అయినా ఉండదు. తమతోపాటు.. వెంట వచ్చిన అనుచరుల సేవలో టీటీడీ తరిస్తే చాలు అనుకుంటున్నారు.మంత్రి ఉషాశ్రీ చరణ్ తీరు మాత్రం పీక్స్కు వెళ్లిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వరస సెలవు దినాలకు తోడు పెళ్లిళ్ల సీజన్ కావడంతో తిరుమలలో భక్తుల తాకిడి ఊహించని విధంగా పెరిగిపోయింది. క్యూ లైన్లు గోగర్భం డ్యాం వరకు చేరుకున్నాయి. సర్వ దర్శనానికి రెండు రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. సమస్య తీవ్రత గమనించిన టీటీడీ.. సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చేందుకు 21 వరకు సిఫారసు లేఖలపై పఎఖ బ్రేక్ దర్శనలను రద్దు చేసింది. ఆ మేరకు టీటీడీ ఛౌర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశాలు ఇచ్చారు. కానీ.. అదే టైమ్లో మంత్రి ఉషాశ్రీచరణ్ వచ్చి నానా రచ్చ చేశారు. సిఫారసు లేఖలపై దర్శనాలనే కదా రద్దు చేశారు.. అందుకే నేనే స్వయంగా కొండకు వస్తున్నా అని టీటీడీకి సమాచారం ఇచ్చారు. మూడు రోజుల వ్యవధిలో రెండోసారి దర్శనానికి వచ్చారు మంత్రి. 10 మంది అనుచరులకు సుప్రభాత సేవ, 50 మంది అనుచరులను తనతోపాటు దర్శనానికి తీసుకెళ్లారు. పైగా ఇంత రష్లోనూ కల్యాణదుర్గం ప్రజలకు దర్శనం కల్పించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు అమాత్యులవారు.సొంత నియోజకవర్గం ప్రజలపై చాలా ప్రేమ చూపించారు సరే.. మరి.. గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉన్న సామాన్య భక్తుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి జారుకున్నారు మంత్రి ఉషాశ్రీచరణ్. మొత్తానికి తిరుమల కొండపై మంత్రులు చేస్తున్న హంగామా తీవ్ర విమర్శలు తప్పడం లేదు. అమాత్యుల తీరు టీటీడీకి వివాదాలను తెచ్చిపెడుతోంది.