చంద్రగిరిలో మిస్టరీ మంటలు…

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొత్త శానంబట్ల గ్రామంలో మిస్టరీ మంటల సస్పెన్స్‌ కొనసాగుతోంది. గ్రామంలోని పలు ఇళ్లలో అకస్మాత్తుగా మంటలు చెలరేగుతున్నాయి. మంటలకు కారణం ఏంటో, ఎక్కడ నుంచి వ్యాపిస్తున్నాయో కూడా అర్థం కావట్లేదు. 20 రోజులుగా గ్రామస్థులకు కంటి విూద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏడు ఇళ్లలో ఉన్నపళంగా మంటలు చేలరేగాయి. పొలాల వద్ద గడ్డివాములు కాలిపోయాయి. కప్‌బోర్డులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి దుస్తులు కాలిపోయాయి. ఇటీవల ఏకంగా ఓ మహిళ కట్టుకున్న చీరకే మంటలు అంటుకున్నాయి. గ్రామంలో పోలీసులు పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. ఇళ్లలో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. క్లూస్‌ టీమ్‌ ఆధారాలు సేకరించింది. ఇదిలా ఉండగా.. గ్రామస్థులు మరో సంచలన విషయాన్ని తెరపైకి తెచ్చారు. 40 ఏళ్ల కిందట గ్రామంలో జరిగిన సంఘటనను గుర్తు చేస్తున్నారు. అసలేం జరిగింది?గ్రామస్థుల్లో ఆందోళన పెరిగింది. బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. బట్టలన్నీ మూటగట్టి ఆరుబయటే ఉంచుతున్నారు. ఏ క్షణాన, ఏ వైపు నుంచి మంటలు వ్యాపిస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. కొంత మంది ఇళ్లకు తాళం వేసి బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు. గ్రామంలో పోలీసులు పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. 60 మంది పోలీసులు 5 బృందాలుగా విడిపోయి మంగళవారం ఇంటింటా తనిఖీలు నిర్వహించారు.గ్రామానికి ఏదో అరిష్టం జరుగుతోందని గ్రామస్థులు చెబుతున్నారు. మంత్రగాళ్లను ఆశ్రయించి ఇప్పటికే పూజలు చేయించారు. గ్రామాన్ని అష్టబంధనం చేశారు. గ్రామ దేవతకు పూజలు చేస్తుండగా.. అక్కడికి సవిూపంలో తాళం వేసిన ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇప్పటివరకు పిల్లపాలెం అన్నదమ్ములకు సంబంధించిన నాలుగు ఇళ్లలో, వారి పొలాల్లో మాత్రమే మంటలు వ్యాప్తి చెందగా.. ప్రస్తుతం ఇతరుల ఇళ్లలోనూ మంటలు వ్యాపిస్తున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు.30 రోజుల కిందట గ్రామంలోకి ఓ బుడబుక్కలి వాడు భిక్షాటన కోసం వచ్చాడని గ్రామస్థులు చెబుతున్నారు. అతడు శపించడం వల్లే ఈ అనర్థాలు జరుగుతున్నాయని అనుమానిస్తున్నారు. ‘బుడబుక్కలి వాడు ఎక్కువ డబ్బులు భిక్షగా వేయాలని అడిగాడు. తక్కువ భిక్ష వేస్తే.. తగిన మూల్యం తప్పదంటూ హెచ్చరించాడు. అతడి తీరును చూసి కొంత మంది గ్రామస్థులు అతడిని తిట్టి గ్రామం నుంచి పంపేశారు. ఆ తర్వాత రోజు నుంచే అకస్మాత్తుగా మంటలు వ్యాపిస్తున్నాయి. అతడు క్షుద్ర ప్రయోగం చేసి ఉంటాడు’ అని గ్రామానికి చెందిన ఓ పెద్దాయన తెలిపారు.ప్రశాంతతకు మారుపేరైన శానంబట్ల గ్రామంలో 40 ఏళ్ల కిందట కూడా ఇదే విధంగా మంటలు వ్యాపించేవని కొంత మంది వృద్ధులు చెప్పారు. నాడు వరుసగా పూరి గుడిసెలు దగ్ధమయ్యాయని గుర్తుచేసుకున్నారు. అదే తీరున నేడు బట్టలు, గడ్డివాములు దగ్ధం అవుతున్నాయని చెబుతున్నారు. నాడు కూడా గ్రామంలోకి వచ్చిన ఓ బుడబుక్కలివాడు గ్రామస్థులు ఇచ్చిన భిక్షకు సంతృప్తిచెందక శాపం పెట్టాడని, క్షుద్రపూజలు చేశాడని చెబుతున్నారు. ఊరి పెద్దలు నాడు ఓ భూత వైద్యుడిని సంప్రదించి, ఆ సమస్యను పరిష్కరించారని చెప్పారు.అగ్ని ప్రమాదాలు సంభవించిన ఇళ్లను క్లూస్‌ టీం సందర్శించి, ఆధారాలను సేకరించింది. వాటిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. మంటలు చెలరేగటానికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రసాయన చర్య వల్ల మంటలు సంభవించవచ్చని భావిస్తున్నారు. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ఇవ్వనున్న రిపోర్ట్‌లో ఏం చెబుతారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ‘శానంబట్ల గ్రామంలో మిస్టరీ మంటలను ఛేదిస్తాం. వివరాలు సేకరించాం. ప్రజలు క్షద్రపూజలు, మూఢనమ్మకాలు నమ్మెద్దు’ అని చంద్రగిరి డీఎస్పీ యశ్వంత్‌ అన్నారు.గ్రామస్థుల ఆందోళనతో శానంబట్లలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నిత్యం 30 మంది పోలీసులతో పహారా కాస్తున్నారు. గ్రామంలోకి వచ్చే బయట వ్యక్తులను, గ్రామం నుంచి బయటికి వెళ్లేవారిని క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు. గ్రామంలో పలు ఆంక్షలు విధించారు. అత్యవసర సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు అధికారులు తెలిపారు. మిస్టరీ మంటల నుంచి త్వరగా పరిష్కారం దొరుకుతుందని గ్రామస్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ‘పిల్లాపాపలతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాం. ఆ దేవుడే కాపాడాలి. ఈ సమస్య నుంచి త్వరగా బయటపడాలి’ అంటూ గ్రామస్థులు కంటతడి పెడుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *